
రారండోయ్.. సర్కారు బడికి
● ‘బడిబాట’కు విద్యాశాఖ సన్నద్ధం ● జూన్ 6 నుంచి 19 వరకు కార్యక్రమాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో 2025– 26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయులు జూన్ 6 నుంచి బడి బయట ఉన్న బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. సర్కారు స్కూళ్లు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్యాబోధన అంశాలను ప్రచార అస్త్రాలుగా వినియోగించనున్నారు.
ఉపాధ్యాయులు సన్నద్ధం
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ‘బడిబాట’ పేరిట జూన్ 3 నుంచి 11 వరకు, పాఠశాలల పునఃప్రారంభం నుంచి జూన్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈసారి మాత్రం జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయులను సైతం సన్నద్ధం చేశారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు ఇటీవల ఆయా మండలాల్లో ఉపాధ్యాయులకు నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. మండల విద్యాధికారులకు హైదరాబాద్లో సోమవారం నుంచి శిక్షణ కొనసాగుతోంది.
సర్కారు స్కూళ్లపై నమ్మకం పెంచేలా..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,263 ఉన్నాయి. ఇందులో స్థానిక సంస్థల కింద నడిచే ప్రభుత్వ పాఠశాలలు 720 ఉన్నాయి. జిల్లాలో మొత్తం విద్యార్థులు 84,855 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కంటే 20 శాతం పెంచాలన్నదే లక్ష్యం. దీనికోసం సర్కారు పాఠశాలలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంది. నాణ్యమైన విద్య అందిస్తున్న తీరును వివరించడంతోపాటు బోధన సదుపాయాలు, సాధించిన ఫలితాల గురించి తెలియజేయనున్నారు. జిల్లాలోని ఎనిమిది పాఠశాల్లో ఏఐ క్లాసులు కొనసాగుతుండగా.. జూన్ నుంచి మరిన్ని పాఠశాలల్లో విస్తరించనున్నారు.
విజయవంతం చేద్దాం
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కా ర్యక్రమాన్ని అందరి సమన్వయంతో విజ యవంతం చేద్దాం. ఇటీవల శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. షెడ్యూల్ వారీగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి.
– యాదయ్య, డీఈవో
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్యామ్యం చేస్తూ గ్రామసభ నిర్వహించాలి.
7న ఉపాధ్యాయులు ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి.
8, 9, 10 తేదీల్లో ఇంటింటికీ కరపత్రాలతో ప్ర చారం చేయాలి. అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చే ర్పించడంతో పాటు ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
11న కార్యక్రమాలపై సమీక్షించుకోవాలి.
12న పాఠశాలలను అలంకరించి పండుగ వా తావరణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. అమ్మ ఆద ర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు ప్రారంభించాలి. విద్యార్థులకు పాఠ్య పుస్తకా లు, నోట్బుక్లు, యూనిఫాం అందించాలి.
13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.
16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్), లర్నింగ్, ఇంప్రూమెంట్ ప్రోగ్రాం దినోత్సవాన్ని జరుపుకోవాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించారు. పిల్లలు రూపొందించిన చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించాలి.
17న సమీకృత విద్యా బాలికా దినోత్సవం ని ర్వహించాలి. మైనర్వివాహాలు, చిన్నారుల పై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
18న తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇతర ఆధుని క సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంప కం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.
19న బడిబాట ముగింపు సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించాలి.