
వర్షాకాలం.. పశువులు పైలం
చెన్నూర్రూరల్/ లక్ష్మణచాంద: వర్షాకాలం ఆరంభమైంది. ఈసారి ముందస్తుగానే వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు కూడా మొ దలయ్యాయి. మరోవైపు అకాల వర్షాలకు నేల కూడా పచ్చబడింది. లేదగడ్డి పశువులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో, పశువులకు అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉందని కత్తెరసాల, లక్ష్మణచాంద పశువైద్యాధికారి సతీశ్, ఓంప్రకాశ్ సూచించారు. పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు సంబంధించిన సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స విధానాలు వెల్లడించారు.
గాలిపుండు (ఫుట్రాట్)
వ్యాధి లక్షణాలు: వర్షాకాలంలో చిత్తడి నేలలపై తిరిగే మేకలు, గొర్రెలకు గాలిపుండు వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వల్ల గొర్రెలు కుంటుతూ, మూడు కాళ్లపై గెంటుతాయి. గిట్టల మధ్య ఎర్రగా కందిపోయి, చీము పట్టి నల్లగా మారుతుంది. తీవ్రమైతే గిట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది.
నివారణ చర్యలు
వ్యాధి సోకిన పశువులను వెంటనే గుర్తించి, ఆరోగ్యవంతమైన వాటికి దూరంగా ఉంచాలి.
చిత్తడి నేలలు, నీరు నిలిచే ప్రాంతాల నుంచి పశువులను దూరంగా ఉంచాలి. వర్షం నుంచి రక్షణ కల్పించే ఆరు ప్రాంతాల్లో పశువులను ఉంచాలి.
చికిత్స తర్వాత నయమైన పశువులను మాత్రమే ఆరోగ్యవంతమైన వాటితో కలపాలి.
చికిత్స విధానం
వైద్యుని సలహాతో పెన్సిలిన్, నొప్పి నివారణ మందులు వాడాలి. వ్యాధి సోకిన గిట్టలను 10% ఫార్మలిన్ లేదా కాపర్సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి.
నీలి నాలుక వ్యాధి (బ్లూ టంగ్ డిసీజ్)
వ్యాధి లక్షణాలు: నీలి నాలుక వ్యాధి, వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఈవ్యాధి విస్తరణ అవకాశం ఎక్కువ.
లక్షణాలు: అధిక జ్వరం, చొంగ కారడం, పెదవులు, చిగుళ్లు వాచడం, ఎర్రటి గుల్లలు ఏర్పడడం.
తీవ్ర సందర్భాల్లో గిట్టలు వాచి, నాలుక నీలం రంగులోకి మారుతుంది.
పశువులు నడవలేక, మేత మేయక, అచేతన స్థితికి చేరి కిందపడిపోతాయి.
నివారణ చర్యలు: ఈగలు, దోమల నివారణకు రోజుకు రెండుసార్లు వేప ఆకులతో పొగ వేయాలి.
బురద, నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రం చేయాలి.
చికిత్స విధానం
పశువైద్యుడిని సంప్రదించి, యాంటీబయోటిక్, నొప్పి నివారణ మందులు వాడాలి.
నోటి పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, జింక్ పౌడర్ రాయాలి.
గిట్టల పుండ్లకు హామాక్స్, లేమనెంట్ వంటి ఆయింట్మెంట్లు వాడాలి.
చిటుకు వ్యాధి..
తొలకరి గడ్డిలో క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డి అనే రకం సూక్ష్మజీవులు ఉంటాయి.ఈ సూక్ష్మ జీవులు గాలి లేని వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. తొలకరి పిచ్చి గడ్డిని జీవాలు తిన్నప్పుడు జీవాల పేగుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడి అక్కడ సూక్ష్మజీవుల వల్ల ఏర్పడిన విష పదార్థాల వల్ల ఈ చిటుకు వ్యాధి వస్తుంది.
వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన గొర్రెలు కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆకస్మికంగా మరణిస్తాయి. కొన్ని ఎగిరి కిందపడి కాళ్లు కిందకు కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ చనిపోతాయి. వ్యాధి సోకిన గొర్రెలు చొంగ కారుస్తాయి. శ్వాస అధికంగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
చికిత్స కంటే నివారణ ముఖ్యం. మే నుంచి జూలై వరకు వ్యాధినిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశు వైధ్యాధికారికి తెలియ చేసి చికిత్స చేయించాలి. తొలకరి చినుకులకు మొలిచిన గడ్డి మేయకుండా చూసుకోవాలి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేయాలి.

వర్షాకాలం.. పశువులు పైలం

వర్షాకాలం.. పశువులు పైలం