
పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గురువారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. సెలవులు సద్వినియోగం చేసుకునేలా ఇండోర్ గేమ్స్ క్యారమ్, చెస్, యోగా, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, పెయింటింగ్, కరాటే, సంగీతం వంటి అంశాలను ఉచితంగా నేర్పించనున్నారు. ఒక్కో పాఠశాలలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రతీ స్కూల్లో వందమందికి శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల అల్పాహారం కోసం రోజుకు రూ.15, మెటీరియల్ కోసం పాఠశాలకు రూ.10వేల చొప్పున, శిక్షకులకు రూ.3వేల చొప్పున అందించనున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజువారీగా శిక్షణకు సంబంధించిన ఫొటోలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు పంపించాలని డీఈవో యాదయ్య ఆదేశించారు.