
బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్ణీత వయస్సు రాకుండా బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేస్తామని డీసీపీవో బూర్ల మహేశ్ హెచ్చరించారు. మండలంలోని నారాయణపూర్లో ఓ మైనర్ బాలికకు వివాహం జరిపిస్తున్నట్లు సమాచారం రావడంతో.. బుధవారం జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను కౌన్సెలింగ్ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు, పౌర సమాజం సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం– 2006 ప్రకారం రెండేళ్ల నాన్ బెయిలెబుల్ జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ ఝాన్సీరాణి, సిబ్బంది పాల్గొన్నారు.