
వృద్ధ క్రీడాకారులకు అభినందన
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ మాస్టర్స్ గేమ్స్– 2025లో పరుగు పందెంలో పతకాలు సాధించిన ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన వైరాగడె శకుంతల, ఆనంద్రావ్ దంపతులను జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం అదనపు ఎస్పీ ప్రభాకర్రావు అభినందించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో శకుంతల 50ప్లస్ ఏజ్ గ్రూపు మహిళా విభాగంలో 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో మొదటిస్థానం, ఆనంద్రావ్ 55 ప్లస్ ఏజ్గ్రూపు పురుషుల విభాగం రేస్ వాక్లో రెండోస్థానంలో నిలిచారు. ఏఎస్పీ మాట్లాడుతూ గెలవాలనే కోరికకు వయస్సు అడ్డురాదనే నిజాన్ని ఆనంద్రావ్ దంపతులు రుజువు చేశారన్నారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.