లాభాల పంట
● రూ.3,460 కోట్ల నుంచి రూ.4,338 కోట్లకు చేరిక ● రూ.30 కోట్ల లాభాలతో రికార్డు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) లావాదేవీలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. గత ఏడాది(2024–25) రూ.3,460 కోట్లుగా లావాదేవీలు రూ.4,338 కోట్లకు పెరిగినట్లు అధికారులు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. డీసీసీబీ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలో కలిపి 101 సహకార సంఘాలు, 176 వ్యవసాయేతర సంఘాలు ఉన్నాయి. అలాగే, 52 డీసీసీబీ బ్రాంచ్లు కొనసాగుతుండగా వ్యవసాయ రుణాలే కాక మార్ట్గేజ్, బంగారం, విద్యా, గృహ, వాహన రుణాలు మంజూరు చేస్తున్నారు. తాజాగా ముగిసిన 2025–26లో రూ.1,423.86 కోట్ల డిపాజిట్లు, రూ. 2,915.12 కోట్ల అడ్వాన్సులు రాగా, మొత్తం రూ.4,338.98 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అంతేగాక పాత బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొత్తంగా దాదాపు రూ.900 కోట్ల లావాదేవీలు పెరగగా, రాష్ట్రంలో కరీంనగర్ డీసీసీబీ తర్వాత ఖమ్మం రెండో స్థానాన నిలిచింది.
ఖమ్మం డీసీసీబీ లాభాల్లోనూ చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది రూ.30.9 కోట్ల లాభాలు గడించింది. గత ఏడాది రూ.5.30 కోట్లుగా లాభాలు ఒక్కసారిగా రూ.30కోట్లకు పైగా పెరగడం విశేషం. రెండేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న బ్యాంకు క్రమంగా లాభాల బాట పట్టి ఈ స్థాయికి చేరింది. లాభాల విషయంలో కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ తర్వాత నాలుగో స్థానాన ఖమ్మం నిలిచింది.


