పిల్లల పర్యవేక్షణకు గ్రామ కమిటీ : అదనపు కలెక్టర్ శ్రీజ
బోనకల్: గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యమైతే మంచి ఫలితాలు వస్తాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో గురువారం గ్రామసభలు నిర్వహించగా, బోనకల్ మండలం ముష్టికుంట్ల రైతువేదికలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పిల్లల సంక్షేమ పర్యవేక్షణకు గ్రామ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలతో ఏర్పడే ఈ కమిటీ ద్వారా బాల్యవివాహాలు కట్టడితో పాటు పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై ఆమె సూచనలు చేశారు. తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరావు, ఉపసర్పంచ్ అమిరేశి సీతయ్య, పంచాయతీ కార్యదర్శి సైదులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
●ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు, 177 మున్సిపల్ వార్డుల్లో గురువారం వార్డుసభలు నిర్వహించామని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల పురోగతి, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించినట్లు వెల్లడించారు.
●రఘునాథపాలెం: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. రఘునాథపాలెంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అంతేకాక సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. కాగా, వీ.వీ.పాలెంలో జరిగిన గ్రామ సభలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు మాట్లాడగా, డీపీఓ రాంబాబు, ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అశోక్కుమార్, సర్పంచ్లు గాజుల కృష్ణారావు, పి.రమారాజా, గ్రామ కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
●కూసుమంచి: పారదర్శక పాలన, అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ విజయలక్ష్మీ, మండల ప్రత్యేకాధికారి శ్రీలత, డీపీఓ రాంబాబు, ఎంపీడీఓ రాజారావు, రంజిత్రెడ్డి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


