● భూ భారతిలో అందుబాటులోకి సమీకృత పోర్టల్ ● పైలట్ మండలంగా కూసుమంచి, అశ్వారావుపేట
కూసుమంచి: రైతులకు సంబంధించి భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిలో సమీకృత భూపోర్టల్ను ఏర్పాటుచేశారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని ఐదు మండలాలను ఎంపిక చేయగా, ఉమ్మడి జిల్లాలోని కూసుమంచి, అశ్వారావుపేట ఉన్నాయి. ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పోర్టల్ను ప్రారంభించారు. ఆతర్వాత కూసుమంచిలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ సైదులు పోర్టల్ ద్వారా అందే సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించి మాట్లాడారు.
అన్ని వివరాలు ఒకేచోట...
ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయని ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ సైదులు తెలిపారు. ఒక్క క్లిక్తో రైతులు భూమి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. భూసమస్యలు, హద్దు ల వివాదాలను పోర్టల్ ద్వారా పరిష్కరించుకోచ్చని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వారంలోగా పూర్తిచేసి భూధా ర్ నంబర్ కేటాయిస్తామని వివరించారు. మండలంలో రెండు రోజుల్లోగా సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని వివరించారు. కాగా, మండల సర్వేయర్తో పాటు మరో 16 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించామని తెలిపారు.


