హైవేపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్
ఏర్పాటు చేయాలి
నేలకొండపల్లి: కోదాడ – ఖమ్మం జాతీయ రహదారిపై నేలకొండపల్లి వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి శుక్రవానం వచ్చిన ఖమ్మం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డికి ఏటుకూరి రామారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఇటీవల మృతి చెందిన వాక రంగయ్య కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఆతర్వాత కొత్తకొత్తూరు, నాచేపల్లి, మంగాపురంతండాల్లో కూడా పర్యటించగా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంగాపురంతండా సర్పంచ్ ధీరావత్ అశోక్రాణి వినతిపత్రం ఇవ్వడంతో పాటు సన్మానించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, వెంకన్న, బొందయ్య, భద్రయ్య, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, కుక్కల నరేష్, కడియాల నరేష్, మేకల వెంకటేశ్వర్లు, గొబ్రియా తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి బకాయిలు చెల్లించాలి
మణుగూరు టౌన్/మణుగూరు రూరల్: ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.51 కోట్ల బకాయిలు విడుదల చేయడంతోపాటు మెడికల్ అన్ఫిట్ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఏఐటీయూసీ ఆధ్వర్యాన సేవ్ సింగరేణి పేరిట చేపట్టిన పోరుజాతా(బస్సు యాత్ర) శుక్రవారం మణుగూరుకు చేరింది. యాత్ర మణుగూరు ఏరియాలోని గనులు, జీఎం కార్యాలయ ప్రాంతాల్లో కొనసాగింది. అనంతరం భారీ బైక్ ర్యాలీ నడుమ మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు చేరాక అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా పీవీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయానికి చేరుకున్నారు. పలు చోట్ల జరిగిన సమావేశాల్లో సీతారామయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. మణుగూరు పీకేఓసీ డీప్ సైట్ బ్లాకుతో పాటు అన్ని బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, వై.రాంగోపాల్, మేకల ఈశ్వర్రావు, ఎం.వీ.రాంనర్సయ్య, ఆవుల నాగరాజు, సురేందర్, శ్రీనివాసరావు, కుమారస్వామి, గంఽగాధర్రావు, రాజశేఖర్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్ాగ్యల సుధాకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలు డిమాండ్తో పర్యటన
భద్రాచలం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడుతున్నట్లు రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. యాత్రను శుక్రవారం భద్రాచలంలో ప్రారంభించడంతో పాటు భక్తులతో కలిసి రైతుల మహాగర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు, కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించాలనే డిమాండ్తో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


