ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశమంతా రామయ్య కల్యాణం పగటి పూట జరిగితే, రెండో భద్రాద్రిగా పేరున్న ముత్తారంలోని సాయం సంధ్యాసమయాన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఉదయం ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు ఉత్సవం నిర్వంచారు. అలాగే, గోటితో వలిచిన తలంబ్రాలను భక్తులు సమర్పించగా, తలంబ్రాలు, పట్టువస్త్రాలను వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు సమర్పించారు. అనంతరం పండితుల వేదమంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, శ్రీనివాసాచార్యులు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ క్రతువు నిర్వహించారు. ముదిగొండ, నేలకొండపల్లి, చింతకానితో పాటు పలు ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు కల్యాణాన్ని తిలకించారు. ఆలయ చైర్మన్ తుళ్లూరి లత, ముత్తారం, వనంవారికిష్టాపురం సర్పంచ్లు ఎల్.మమత, పర్ణకోల జ్ఞానసరళ ఆరోగ్యమేరి, వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు, ఆలయ పునర్నిర్మాణ దాత పరుచూరి ప్రసాదరావు, ఈఓ సమత, ఎంపీడీఓ భాస్కర్రావు, ఆలయ మాజీ చైర్మన్ తుళ్లూరి జీవన్బాబు, పాలకమండలి సభ్యులు, నాయకులు మల్లెల అజయ్, మట్టా బాబురామిరెడ్డి పాల్గొన్నారు.
ముత్తారంలో వేడుకగా క్రతువు


