కేంద్రం విధానాలపై 21నుంచి చైతన్యయాత్రలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, దేశీయ రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు విమర్శించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయంగా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఎరజ్రొన్నలు పండించే రైతులు భారీగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గించారని విమర్శించారు. ఈమేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈనెల 12న కార్మికులతో కలిసి రైతులు నిరసన తెలపనుండగా, ఈనెల 21నుంచి మార్చి 5వరకు గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రచార యాత్రలు, సభలు నిర్వహించి రైతులను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, కోశాధికారి కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


