విద్యుత్ శాఖలో మహిళా కమిటీ
ఖమ్మంవ్యవసాయం: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై రూపొందించిన చట్టం అమలుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. ఈమేరకు ఖమ్మం విద్యుత్ శాఖలో మంగళవారం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్ పర్సన్గా టిరజనికుమారి(జేఏఓ), సభ్యులుగా పి లక్ష్మీప్రియ(ఏఈ), బి.మానస(జేఏఓ), టి.బబిత(సీనియర్ అసిస్టెంట్), ఆర్.సంధ్యారాణి(ఆర్టిజన్ గ్రేడ్–1)లను నియమించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో కమిటీ, మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడారు. 2013లో ఏర్పాటైన లైంగిక వేధింపుల నివారణ చట్టం పై మహిళా ఉద్యోగులకు నూతన కమిటీ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను గోప్యంగా ఉంచి విచారణ చేపడుతారని వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని ఎస్ఈ తెలిపారు.


