ఓటు వేయడం కష్టమే...
● గడప దాటలేని స్థితిలో వృద్ధులు, దివ్యాంగులు ● ‘హోం ఓటింగ్’ అవకాశం లేక ఆవేదన
సత్తుపల్లిటౌన్: వృద్ధులు, దివ్యాంగులు పలువురు గడప దాటలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలంటే యాతన పడాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం గతంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు అవకాశం కల్పించింది. ఎన్నికల అధికారులకు ముందస్తుగా సమాచారం ఇస్తే పరిస్థితి తీవ్రత ఆధారంగా జాబితాలో చోటు కల్పించే వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించేవారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ఓటు వినియోగించుకోవాలనే ఆకాంక్ష ఉన్నా శరీరం సహకరించని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొందరిని కుటుంబీకులు, మరికొందరిని అభ్యర్థులు అతికష్టంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నా.. ఇంకొందరు మాత్రం ఓటుకు దూరం కావాల్సి వస్తోంది.


