అటు ఏపీ.. దాటొస్తే తెలంగాణ
ఇక్కడ జాతీయ స్థాయి ఖ్యాతి కలిగిన పరిశ్రమలు, విద్యాలయాలు
ఆహ్లాదకరమైన వాతావరణం
మరో ప్రత్యేకత
అశ్వారావుపేట: మున్సిపాలిటీగా తొలిసారి ఎన్నికలు జరగనున్న అశ్వారావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆహ్లాదకర వాతావరణం, పచ్చని పంటలు, జాతీయ స్థాయి ఖ్యాతి కలిగిన పలు సంస్థలు.. ఇలా అనేక అంశాలు ఈ మున్సిపాలిటీ సొంతం! 1950లోనే ఇక్కడ ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహం అశ్వారావుపేటలో ప్రధాన సెంటర్గా ఉండేది. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ పాత అశ్వారావుపేటగా ఉంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణకు సరిహద్దుగా ఉండే అశ్వారావుపేటలో హైదరాబాద్, రాజమండ్రి, భద్రాచలం రోడ్లను కలిపే రింగ్ సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో వివేకానందుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రింగ్ సెంటర్ వచ్చిందంటే తెలంగాణలోకి ప్రవేశించామని వాహనదారులు, డ్రైవర్లు గుర్తిస్తారు.
అశ్వారావుపేట వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలతో స్థానిక, స్థానికేతర యువతకు ఉపాధి లభిస్తోంది. అశ్వారావుపేటలో పేపర్ మిల్లుతో పాటు పవర్ ప్లాంట్ కూడా ఉంది. అలాగే, కెమిలాయిడ్స్, హెర్బెక్స్ పరిశ్రమలు ఉండగా, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది. అశ్వారావుపేటలోనే తెలంగాణలో మొట్టమొదటి ఆయిల్పామ్ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో నిర్ణయించిన నూనె దిగుబడి శాతాన్ని అనుసరించే ఆయిల్పామ్ గెలల ధర నిర్ణయిస్తుండడం విశేషం.
అశ్వారావుపేట ఏర్పాటైన తొలినాళ్లలో కులాల వారీగా బజార్లు ఏర్పాటయ్యాయి. గౌడ బజార్, వడ్డెర బజార్, మంగలి బజార్, దూదేకుల బజార్, శివయ్యగారి బజార్, మేరీల బజార్ ఇలా సులువుగా గుర్తిస్తుంటారు. కాలక్రమేణా కాళింగుల బజార్ కూడా ఏర్పడింది. బందరు నుంచి వ్యవసాయం నిమిత్తం అశ్వారావుపేటకు వచ్చి స్థిరపడిన వారితో బందరు మకాం, కోత మిషన్ ఉన్నందుకు కోత మిషన్ బజార్ ఏర్పడ్డాయి. పుల్లలు కొట్టే వారు నివసించే ప్రాంతం పుల్లల కాలనీ, డ్రైవర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ డ్రైవర్ల కాలనీగా ఏర్పడినా ప్రస్తుతం బీసీ కాలనీగా రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అటెండర్స్ కాలనీ, ఎన్టీఆర్ హయాంలో మంజూరైన ఇళ్లతో నందమూరి కాలనీ, జలగం ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలతో జలగం కాలనీ, ఫైర్ సిబ్బంది నివాసాలతో ఫైర్ కాలనీ, వైఎస్సార్ హయాంలో నిరుపేదలకు మంజూరు చేసిన కాలనీ మోడల్ కాలనీగా పేరు పొందాయి. దీనిని అల్లుళ్ల కాలనీగా కూడా పిలుస్తుంటారు. ఇవి కాక అల్లూరి సీతారామ రాజు కాలనీ, అశ్వారావుపేట జమీన్దారుల గుర్రాలు నీళ్లు తాగిన ప్రాంతం గుర్రాలచెరువుగా ఉండేది. ఈ గ్రామపంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది. అలాగే, దొంతికుంట చెరువుకు సమీపంలో పేదలకు మంజూరు చేసిన కాలనీ దొంతికుంటగానే కాక దివ్యాంగుల కాలనీ, కార్మికులతో ఆటోనగర్ పేర్లు స్థిరపడ్డాయి.
సరిహద్దులో ‘పేట’
మున్సిపాలిటీ
అటు ఏపీ.. దాటొస్తే తెలంగాణ


