ప్రజలకు అండగా కమ్యూనిస్టులు
● ప్రజా సేవకులకు ఓట్లు వేయండి ● సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ
ఖమ్మంరూరల్: ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉండేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో నారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజా సేవకులకు మాత్రమే ఓట్లు వేయాలని, నిత్యం ప్రజల్లో ఎవరు ఉంటున్నారు? బయటి నుంచి ఎవరు వచ్చి పోటీలో ఉన్నారు? అనే విషయాలను బేరీజు వేసుకుని ఓటు వేయాలని తెలిపారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని, కరపత్రాలతో ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది కూడా కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి, పాలకులను నిలదీసి, పరిష్కరించిన ఘనత సీపీఐదేనని తెలిపారు. శాసనసభలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నాడని చెప్పారు. ప్రతీ ఎన్నికలకు పార్టీ మార్చేవారు ప్రజలకు ఏంసేవ చేస్తారని, కేవలం వారి స్వలాభం చూసుకుంటారని, అలాంటి వారిని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు ఒకే చోట స్థానం ఉంటుందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారిని ఆపదలో ఆదుకంటూ ప్రజల కోసం పనిచేసే వారిని మాత్రమే మున్సిపాలిటీలో పాలకవర్గంగా ఉంచాలని కోరారు. బయటి వారు ఎన్నికలు అయిపోగానే వాళ్లదారి వారు చూసుకుంటారని, ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు వారికి గుర్తుండవని స్పష్టం చేశారు. ఖమ్మంరూరల్ మండలంలో పలు కాలనీలను తొలగించాలని పాలకులు ప్రయత్నించినప్పుడు అడ్డుపడి ప్రజల పక్షాన నిలబడింది ఎర్రజెండా నాయకులేనని ఆయన వెల్లడించారు. సభలో సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, మిడకంటి చినవెంకటరెడ్డి, దండి రంగారావు, చెరుకుపల్లి పవిత్ర, మిడకంటి అరుణశ్రీ, దండి వ్రీజ తదితరులు పాల్గొన్నారు.


