భారమంతా కేటీపీఎస్దే..
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో రెండు డివిజన్ల నిర్వహణ మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటోంది. ఈ వార్డుల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ యాజమాన్యం చూస్తుండగా, పన్నులు మాత్రం మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. 2వ డివిజన్ పరిధిలో కేటీపీఎస్ కాలనీతో పాటు ప్రశాంత్కాలనీ కలిసి ఉంటుంది. ఇక్కడ సుమారు 2,600 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. నాలుగో డివిజన్లో కేటీపీఎస్ కాలనీతో పాటు రాహుల్గాంధీ నగర్ కలిసి ఉంది. ఇక్కడ సుమారు 2,400 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ కాలనీల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ అధికారులే నిర్వహిస్తుంటారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, రోడ్లు ఇలా అన్ని రకాల వసతులు సంస్థనే చూస్తుంది. రోజువారీ నిర్వహణ బాధ్యతలు సైతం అక్కడి సిబ్బందే చేస్తుంటారు. కాలనీల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ యాజమాన్యం చూస్తున్నా, క్వార్టర్లకు సంబంధించిన పన్నులు మాత్రం 50 శాతం మేర మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. ఈ డివిజన్ల నుంచి ఇద్దరు కేటీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు.
పాల్వంచ రెండు డివిజన్లలో కేటీపీఎస్ కాలనీలు


