రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
రామయ్యను దర్శించుకున్న ఆండవన్స్వామి..
శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు
రఘునాథపాలెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపా రు. మండలంలోని వీ.వీ.పాలెంకు చెందిన చండ్ర రమేష్ తనకు చెందిన రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. అదేగ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ దున్నించి పంటను ధ్వంసం చేశాడని శనివారం రమేష్ ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసినట్లు సీఐ తెలిపారు.


