
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి..
● అప్పుడే జీవితంలో రాణించొచ్చు ● కల్లూరు జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరు: పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇవ్వాలని తల్లిదండ్రులు పడే తాపత్రయం, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో రాణించవచ్చని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కల్లూరులో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన కలెక్టర్ అనుదీప్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కల్లూరులో రూ.75 లక్షలతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభించగా, రూ.75 లక్షలతో నిర్మించనున్న అంబేద్కర్ లైబ్రరీ భవనం, రీడింగ్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, కల్లూరు మార్కెట్ యార్డ్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు. ఆతర్వాత కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆషా ఫౌండేషన్ ఆధ్వర్యాన విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాలు పంపిణీ చేశాక మంత్రి మాట్లాడారు. కల్లూరు కళాశాల నుంచి 3.5 కి.మీ. దూరాన ఉన్న నారాయణపురంలో పుట్టిన తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు చేస్తానని ప్రకటించారు. గతంతో పోలిస్తే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున కష్టపడి చదవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జీలు 200 శాతం పెంచామని, ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా గురుకులాలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇంటర్ చదువు ప్రతీ విద్యార్థి జీవితంలో కీలక మైలురాయిగా నిలవనున్నందున ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటర్లో మంచి మార్కులు సాధిస్తే ఇంజనీరింగ్, మెడికల్, ఇతర వృత్తి నైపుణ్య కోర్సులు పూర్తిచేసి ఉన్నతస్థాయికి చేరవచ్చని తెలిపారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడగా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, పీఆర్ ఎస్ఈ జి.వెంకట్రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్, మార్కెట్ చైర్పర్సన్ బాగం నీరజ, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ సంపత్కుమార్, మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, నాయకులు పసుమర్తి చందర్రావు, బాగం ప్రభాకర్రావు, లక్కినేని సత్యం, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీను, సయ్యద్ అలీ, ఎస్డీ.అమీరుద్దీన్, ఎస్కే.యాకూబ్ అలీ, ఎస్డీ.ఇషాక్, తురాబల్లి, ఎస్కే.ఉస్మాన్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కూసుమంచి: ప్రతీ మారుమూల గ్రామాన్ని సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలంలోని భగవత్వీడు, మంగలితండా, ఈశ్వరమాధారం, రాజుపేట బజార్, పెరికసింగారం గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణ పనులకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా చక్కబెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రజలే ప్రాధాన్యతగా పథకాలు అందుతాయని చెప్పారు. ప్రతీ గ్రామంలో పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.