
సేవాభావం పెంపొందించుకోండి..
తిరుమలాయపాలెం: విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సేవా దృక్పథం, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఎన్.శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండలంలోని ఎదుళ్లచెరువులో పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వారం పాటు నిర్వహించనున్న శిబిరంలో విద్యార్థులు సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్య పరచాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, మనోహర్రాజు, ఏవీ నాగేశ్వరరావు, బోడా మంగీలాల్, రవి, నారాయణరావు, చంద్రమౌళి, కమతం వెంకటేశ్వర్లు, కాంపాటి శ్రీనివాసరావు, నేరడి సత్యం పాల్గొన్నారు.
కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పరిశీలన
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను సింగరేణి డైరెక్టర్ ఎం.తిరుమల్రావు పరిశీలించారు. బొగ్గు రవాణా, నిర్వహణలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. శైలోర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్, డీఎఫ్డీఎస్ సిస్టం, విండ్ బ్యారియర్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సింగరేణి డైరెక్టర్ తిరుమల్రావును సన్మానించారు. కార్యక్రమంలో సీహెచ్పీ జీఎం రామమూర్తి, పీఓ ప్రహ్లాద్, ఇంజనీర్ సూర్యనారాయణరాజు, సోమశేఖర్రావు, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
యూరియా కోసం
ఆందోళన
బోనకల్: పంటలకు కీలకమైన సమయాన యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బోనకల్ మండలం రావినూతల పీఏసీఎస్కు శనివారం 323 బస్తాల యూరియా రాగా, రావినూతల, ఆళ్లపాడు నుంచి దాదాపు 400మంది రైతులు చేరుకున్నారు. ఎవరికి వారే ముందు తమకు ఇవ్వాలని పట్టుబట్టడంతో తోపులాట జరిగింది. కాగా, ఆధార్ కార్డుల బదులు సాగు భూమి ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో ఐదు ఆధార్ కార్డులు ఉంటే వారికి ఐదు బస్తాలు ఇస్తే, తక్కువ కార్డులు ఉన్న వారికి యూరియా లభించడం లేదన్నారు. ఈమేరకు ఎస్సై పి.వెంకన్న, ఏఓ పి.వినయ్కుమార్ రైతులకు నచ్చజెప్పి స్టాక్ ఉన్నంత మేర కూపన్ల ఆధారంగా పంపిణీ చేశారు.
అధ్యాపకురాలికి డాక్టరేట్
ఖమ్మంరూరల్: మండలంలోని కోదాడ క్రాస్రోడ్లో గల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు సామల దీప డాక్టరేట్ సాఽధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ సీహెచ్. సరళాదేవి పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ పూర్తి చేయగా డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా తోటి అధ్యాపకులు దీపను అభినందించారు.
టీకాల ప్రక్రియ పరిశీలన
నేలకొండపల్లి: టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్ రమణ శనివారం పరిశీలించారు. మండలంలోని నాచేపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో పర్యటించారు. స్వస్థ నారి స్వశక్త్ పరివార్ అభియాన్పై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు పథకాలపై వివరించారు. కార్యక్రమంలో హెచ్ఈఓలు చంద్రశేఖర్, జ్యోతి, రాణి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.