
కొత్త పత్తి వస్తోంది..!
కొత్త పత్తిని విక్రయించా..
నాణ్యతగా ఉన్నా ధర లేదు
● ఖమ్మం మార్కెట్కు ఇప్పుడిప్పుడే సరుకు ● ధర కోసం రైతుల ఎదురుచూపులు
ఖమ్మంవ్యవసాయం: వానాకాలంలో రైతులు సాగు చేసిన పత్తి చేతికొస్తోంది. జూన్ ఆరంభంలో సాగు చేసిన వారు ఇప్పుడిప్పుడే పత్తితీత మొదలుపెడుతున్నారు. అయితే, మైల పంటగా భావించే మొదటి సరుకును నిల్వ చేయకుండా విక్రయానికే మొగ్గుచూపుతారు. ఈనేపథ్యాన వారం రోజులుగా ఖమ్మం మార్కెట్కు 500 – వెయ్యి బస్తాల మేర పత్తి వస్తోంది. అయితే, ధర మాత్రం అంతంత మాత్రంగానే పలుకుతోంది.
దసరా దాటితే జోరు
పత్తి పంట సహజంగా వంద రోజుల్లో చేతికి అందుతుంది. జూన్లో సాగు చేసిన పంట తీత ఇప్పుడిప్పుడే మొదలుపెడుతుండగా దసరా తర్వాత జోరందుకునే అవకాశముంది. అయితే, పత్తి క్వింటాకు కేంద్రప్రభుత్వం తేమశాతం ఆధారంగా గరిష్టంగా రూ.8,110 ధర నిర్ణయించింది. కానీ ఆ ధర మార్కెట్లో కనిపించటం లేదు. గత ఏడాది పండించిన పంటకు కూడా కనీస మద్దతు ధర దక్కడం లేదు. కొత్త, పాత పత్తికి తేడా లేకుండానే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి గరిష్టంగా రూ.7,500, మోడల్ ధర రూ.6,500, కనిష్ట ధర రూ.5,100గా పలుకుతోంది. నిత్యం 2వేల బస్తాల పత్తి వస్తుండగా ఇందులో సగం కొత్త పంట ఉంటోంది. కానీ పాత పత్తికి సైతం కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టినా నేపథ్యాన ఆ కేంద్రాలు ప్రారంభమైతే మద్దతు ధర దక్కే అవకాశం ఉంది.
వానాకాలం ఆరంభంలోనే మూడెకరాల్లో పత్తి వేశా. అధిక వర్షాలతో తొలితీతలో 8బస్తాలే వచ్చింది. ప్రభుత్వం క్వింటాకు రూ.8,110 ధర చెప్పినా వ్యాపారులు రూ.5వేల నుంచి రూ.6 వేలకే కొనుగోలు చేశారు. అదేమంటే మైల పంట అని చెప్పారు. – బి.కొండలు, గోవిందాపురం
అన్ సీజన్లో ధర వస్తుందని గత ఏడాది నిల్వ చేసిన పత్తి తీసుకొచ్చా. పంటల పెట్టుబడి కోసం అమ్మకానికి వస్తే కనీస ధర కూడా లేదు. పంట నాణ్యంగా ఉన్నా క్వింటా రూ.6,500కే అడిగారు. అధికారులు స్పందిస్తేనే మేలు జరుగుతుంది.
– జి.సత్యనారాయణరెడ్డి, మోతె, సూర్యాపేట జిల్లా

కొత్త పత్తి వస్తోంది..!

కొత్త పత్తి వస్తోంది..!