
అటు ఓకే.. ఇటే లేటు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం సహకారనగర్: నూతన రేషన్కార్డుల జారీ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, పరి ష్కారాన్ని పట్టించుకోని అధికారులు.. మీ సేవ కేంద్రాల ద్వారా వస్తే మాత్రం వెనువెంటనే పరిష్కరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల్లో సగం మేర మాత్రమే పరిశీలనకు నోచుకోగా... మీ సేవలో వచ్చిన 41,340 దరఖాస్తుల్లో 21,713 మాత్రమే పరిష్కరించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ప్రజాపాలనలో 68 వేలు..
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో రేషన్కార్డుల కోసం 68,212 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నెలలు గడుస్తున్నా కార్డులు అందకపోగా, ఇప్పటి వరకు 34,983 దరఖాస్తులను పరిశీలించారు. వీరిలో కేవలం 5,838 మందికే కార్డులు మంజూరయ్యాయి. దీంతో దరఖాస్తుదారులు తమ పరిస్థితి ఏమిటంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మీ సేవలో దరఖాస్తు చేస్తే ఓకే..
ప్రజాపాలనలో సభల్లో దరఖాస్తులు స్వీకరించడమే కాక గడువు ముగిశాక కూడా అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఇక రేషన్కార్డుల కోసం మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈక్రమాన మీ సేవ నుంచి కొత్త రేషన్కార్డుల కోసం 41,340 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 21,713 అప్రూవ్ చేసి, 519 దరఖాస్తులు తిరస్కరించారు. కానీ ప్రజాపాలన దరఖాస్తుల్లో సగం మేర మాత్రమే పరిశీలించి, మీ సేవ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా మంజూరు చేయడం గమనార్హం.
రేషన్కార్డుల జారీలో
జాప్యంపై ఆగ్రహం
నత్తనడకన ప్రజాపాలన
దరఖాస్తుల పరిశీలన
మీ సేవ ద్వారా వస్తే వెంటవెంటనే మోక్షం
ముందస్తు ఒప్పందాలే కారణమని
విమర్శలు
మేమే ఇప్పిస్తాం...
దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా కనీసం పరిశీలన కూడా జరగకపోవడంపై జనాల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్కార్డులు మంజూరు చేసి, తమను విస్మరిస్తుండడంతో మండిపడుతున్నారు. మరోమారు మీ సేవలో దరఖాస్తు చేయాలనుకున్నా అనుమతించక ఏం చేయాలో పాలు పోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాగా, కొంద రు మీసేవ సెంటర్ల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కవడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే సమయానే రేషన్ కార్డు త్వరగా ఇప్పిస్తామని రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో రెవెన్యూ సిబ్బందికి కొంత వాటా ముట్టచెప్పి ఎలాంటి పరిశీలన లేకుండానే మంజూరు చేయిస్తున్నట్లు తెలిసింది. మీసేవల్లో దరఖాస్తు చేసిన వారికి త్వరగా కార్డులు వస్తుండడం, ప్రజాపాలన సభల్లో ఇచ్చిన దరఖాస్తులు పరిశీలనకు నోచుకోకపోవడంతో ఈ ఆరోపణలు నానాటికీ పెరుగుతున్నాయి.

అటు ఓకే.. ఇటే లేటు