
ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు..
ఆర్టీసీ ఖమ్మం రీజియన్లోని డిపోల నుంచి మొదలయ్యే ఈ బస్సులు నిర్దేశిత ప్రాంతాలకు వెళ్తూ, ఆలయాల సందర్శనకు సమయం ఇచ్చి తిరిగి బయలుదేరుతున్నాయి. అన్నవరం, వాడపల్లి, భద్రాచలం, అరుణాచలం వంటి వాటితో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తద్వారా భక్తులు అలుపు లేకుండా సురక్షితంగా తమ ఆధ్యాత్మిక యాత్ర పూర్తిచేసే అవకాశం లభిస్తోంది.
ఒకటి, రెండు రోజులు...
ఖమ్మం డిపో నుండి అన్నవరం, వాడపల్లి, భద్రాచలం దేవస్థానాలను భక్తులు సందర్శించేలా టూర్ ప్యాకేజీ రూపొందించారు. శుక్రవారం ఉదయం 8గంటలకు బయలుదేరిన ఈ బస్సు అన్నవరానికి చేరుకుని అక్కడ స్వామి దర్శనం పూర్తయ్యాక వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులతో చేరుకుంటుంది. అక్కడ దర్శనం అనంతరం రాత్రి భద్రాచలానికి శనివారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం, ఆతర్వాత కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శన తర్వాత ఖమ్మం వస్తుంది. ఇక సత్తుపల్లి డిపో నుంచి మూడు డీలక్స్ సర్వీసులను మద్ది ఆంజనేయస్వామి ఆలయం, ద్రాక్షారామం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం, పెనుగొండ కన్యకాపరమేశ్వరి ఆలయం, ద్వారకా తిరుమలకు నడిపించారు. మధిర డిపో నుంచి రెండు డీలక్స్ బస్సులతో రామప్ప, భద్రకాళి ఆలయం, పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి, భద్రాచలం డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీ బస్సులను అన్నవరం, ద్రాక్షారామం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్యాకేజీగా ఏర్పాటుచేశారు. మరో ప్యాకేజీగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, హనుమకొండలోని వేయి స్తంభాలగుడికి బస్సులు నడిపారు. ఇక కొత్తగూడెం డిపో నుంచి ఒక డీలక్స్ బస్సు వేములవాడ, కొండగట్టు, హనుమకొండలోని భద్రకాళి ఆలయం, వేయి స్తంభాలగుడికి బయలుదేరింది.
అరుణాచలం గిరిప్రదక్షిణకు..
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యాన వచ్చే 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అక్కడకే వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన అధికారులు ఇందులోనే కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం) దర్శనానికి తీసుకెళ్లేలా ప్యాకేజీ రూపొందించారు.
రీజియన్ నుంచి పుణ్యక్షేత్రాలకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులు
గతంలో అరుణాచలానికి బస్సులు
ఇప్పుడు రీజియన్ నుంచి ఇంకొన్ని క్షేత్రాలకు సైతం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు
నడిపిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి నేరుగా బస్సులు లేక రెండు, మూడు చోట్ల మారాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు తీర్చేలా రాకపోకల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేయడంతో భక్తులు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా అరుణాచలంలో గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం నడిపిస్తున్న సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇంకొన్ని ఆలయాలకు సైతం టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేస్తుండడంతో భక్తులు ఆదరిస్తున్నారు. ఇదే సమయాన ఆర్టీసీకి కూడా మెరుగైన ఆదాయం లభిస్తోంది.
– ఖమ్మంమయూరిసెంటర్/సత్తుపల్లి టౌన్
ప్రత్యేక టూర్ ప్యాకేజీలు..
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఉమ్మడి జిల్లా భక్తుల కోసం టూర్ ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా వెళ్లిరావొచ్చు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. పూర్తి వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు.
– ఏ.సరిరామ్, ఆర్ఎం, ఆర్టీసీ ఖమ్మం రీజియన్
సద్వినియోగం చేసుకోండి..
ప్రయాణికులపై అదనపు భారం లేకుండా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాం. దర్శనం, అల్పాహారం, భోజనం, ఇతర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. బస్సులు ఆలయాల సమీపానికి వెళ్లనున్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– యు.రాజ్యలక్ష్మి,
ఆర్టీసీ డిపో మేనేజర్, సత్తుపల్లి
అరుణాచలం టూర్ షెడ్యూల్ ఇలా..
జూలై 8న సాయంత్రం రీజియన్ పరిధిలోని ఖమ్మం, మణుగూరు, సత్తుపల్లి డిపోల నుండి బస్సులు బయలుదేరనున్నాయి.
ఖమ్మం నుండి రాత్రి 7గంటలకు (సర్వీస్ నంబర్ 64064), మణుగూరు నుండి సాయంత్రం 6గంటలకు (సర్వీసు నంబర్ 55444), సత్తుపల్లి నుండి రాత్రి 7గంటలకు (సర్వీసు నంబర్ 99599) ఈ బస్సులు దేరతాయి.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మరుసటి రోజు ఉదయం కాణిపాకం, మధ్యాహ్నం 2గంటలకు గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం) దర్శనం తర్వాత రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుస్తారు.
ఆతర్వాత రోజైన 10వ తేదీన తెల్లవారుజామున అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ, ఆలయంలో దర్శనం అనంతరం అరుణాచలం నుండి బయలుదేరుతారు. జూలై 11న ఆయా డిపోలకు బస్సులు చేరతాయి.
మణుగూరు డిపో నుంచి బయలుదేరే బస్సు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా వెళ్తుంది. ఇందులో పెద్దలకు రూ.5,500, పిల్ల లకు రూ.2,750గా టికెట్ ధర నిర్ణయించారు.
సత్తుపల్లి డిపో బస్సు వీ.ఎం.బంజర నుంచి వెళ్లనుండగా పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,500 చార్జీ ఉంటుంది.
ఖమ్మం డిపో బస్సు వైరా, మధిర మీదుగా వెళ్తుంది. ఈ బస్సులో పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,500 చార్జీ నిర్ణయించారు.
టికెట్లు ఇతర వివరాల కోసం ఖమ్మం పరిధి ప్రయాణికులు 99592 25958, మణుగూరు డిపో వారైతే 99592 25963, సత్తుపల్లి డిపోకు సంబంధించి 99592 25962 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం

ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం

ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం