
కష్టమెదురైనా నష్టపోకుండా..
మున్నేటి వరద కష్టాలు
ఇటు ఖమ్మం కార్పొరేషన్, అటు ఖమ్మం రూరల్ మండలాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నది వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చడం సాధారణంగా మారింది. గత మూడేళ్లుగా మున్నేటికి వరుసగా వరదలు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 1న వచ్చిన వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇటుక ఇళ్లు, చిన్నపాటి వ్యాపారాలు, వాహనాలు, గృహోపకరణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడమో లేదా దెబ్బతినడంతో స్థానికులు కోలుకోలేని ఆస్తి నష్టాన్ని చవిచూశారు. అంతకు ముందు వచ్చిన వరదలు కూడా వేలాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈమేరకు ప్రభుత్వం ఇచ్చే తక్షణ సాయం మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం కాదని భావించిన అధికారులు శాశ్వత ఆర్థిక భద్రత కోసం బీమానే సరైన మార్గమని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రయోజనాలపై చర్చ..
లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే వారితో బీమా చేయించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధికారులు చర్చించినట్లు తెలిసింది. వరదలతో ఎదురయ్యే ఆర్థిక నష్టానికి ఈ బీమా పథకం రక్షణ కవచంగా ఉంటుందని బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. పరిహారం త్వరగా లభించడంతో నష్టపోయిన ఆస్తులను పునరుద్ధరించుకోవడానికి అవకాశముంటుందని, ప్రజలకు సైతం ధీమా ఉంటుందని వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమీక్ష అనంతరం పథకం విధివిధానాలు, అమలుపై కార్యాచరణ సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నయ్యారు. ఏయే ప్రాంతాలను, ఏ విధంగా బీమా పరిధిలోకి తీసుకురావాలి, ప్రీమియం ఎంత ఉండాలి, నష్టాన్ని అంచనా వేసే విధానం ఎలా, పరిహారం చెల్లించే ప్రక్రియపై విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం.
ముంపు ప్రాంతాల ప్రజల ఆస్తులకు బీమా
వరదలతో వచ్చే నష్టాన్ని పూడ్చేలా అధికారుల నిర్ణయం
ఇళ్లు, వాహనాలు, దుకాణాలు, సామగ్రి ఇన్సూరెన్స్కు ప్రణాళిక
నేటి నుంచి పరీవాహక ప్రాంతాల ప్రజలకు అవగాహన
సమగ్ర బీమా పథకం
ముంపు పాంతాల్లో ఇళ్లు, చిన్నతరహా వ్యాపార సంస్థలు, దుకాణాలు, పలు ఉత్పత్తులు, వాహనాలకు బీమా వర్తింపజేయాలనే లక్ష్యంతో కేఎంసీ అధికారులు ఉన్నారు. తద్వారా వరదలతో కలిగే నష్టానికి పరిహారం లభిస్తుందని చెబుతున్నారు. ఈమేరకు సోమవారం అదనపు కలెక్టర్, ఇన్చార్జి కేఎంసీ కమిషనర్ శ్రీజ.. మెప్మా, ఎల్డీఎం, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో సమావేశమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు బీమా పథకం రూపొందించడంపై చర్చించి, అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈమేరకు తొలి సదస్సును 46, 47, 48వ డివిజన్ల ప్రజల కోసం ఖమ్మం నయాబజార్ కళాశాలలో మంగళవారం నిర్వహించాలని నిర్ణయించారు.
మున్నేటికి గత ఏడాది వచ్చిన వరదతో పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. పెద్దసంఖ్యలో ప్రజలు ఇళ్లు, సామగ్రి సహా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సాయం అందించినా పూడ్చలేని నష్టం జరగడంతో స్థానికులు కోలుకోవడానికి నెలలు పట్టింది. మరోమారు వరద వచ్చినా బాధితులకు ఆస్తినష్టం నుండి దీర్ఘకాలిక రక్షణ కల్పించేలా ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలు, వ్యాపారాలకు ఆర్థిక భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు బీమా చేయించుకుంటే ప్రభుత్వ పరిహారంతో పాటు బీమా నగదు అందే వీలుంది. తద్వారా ప్రభుత్వంపై భారం
తగ్గడంతో పాటు ప్రజలకు ఉపశమనంగా ఉంటుంది. – ఖమ్మంమయూరిసెంటర్