
పేదల సంక్షేమమే మా అజెండా
ఖమ్మంవన్టౌన్/రఘునాథపాలెం: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు ఆర్థిక విధ్వంసానికి పాల్పడినా నెమ్మదిగా సరిదిద్దుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని... తద్వారా దేశమంతా తెలంగాణను అనుసరించే స్థాయికి చేర్చామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. పదేళ్లు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం కొనసాగగా.. తాము అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా సరిచేస్తున్నామని చెప్పారు. రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం వారు శంకుస్థాపన చేయగా, ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ చెప్పినట్లు కులగణన చేయడమే కాక స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. ఈ విషయంలో తొలుత అందరూ హేళన చేసినా ఇప్పుడిది దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. కాగా, పదేళ్ల పాటు దోపిడీ చేసిన ధనంతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏడాదిలోగా పూర్తయ్యేలా తన సహకారం ఉంటుందని భట్టి తెలిపారు.
ఖమ్మం అంటేనే ధైర్యం..
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి పలుమార్లు వచ్చానని తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యమని, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గౌడ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల నిధులతో కూడిన ప్రత్యేక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దేవుళ్లని, పార్టీ కార్యాలయం ఆలయమని పేర్కొనగా.. కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని, రాబోయే పదేళ్లు కూడా అధికారంలో ఉంటామని వెల్లడించారు. గౌడ హాల్ పేదలకు ఉపయోగపడేలా, సమాజానికి సేవ చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు పోట్ల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్గౌడ్, ఏలూరి రవి, చింతల పుష్ప, భవాని, ప్రతిభారెడ్డి, బిచ్చాల తిరుమలరావు, డాక్టర్ రాజశేఖర్, బొల్లికొండ శ్రీనివాసరావు, కత్తి నెహ్రూగౌడ్, బోయనపల్లి లక్ష్మణ్, బండి నాగేశ్వరరావు, బండి వెంకన్న, వత్సవాయి రవి, బొర్రా రాజశేఖర్, పోతగాని వెంకటేశ్వర్లు, రాహుల్, కృష్ట, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
దేశం అనుసరించేలా తెలంగాణలో పాలన
పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలందరికీ పదవులు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్