
తెరుచుకున్న ఖమ్మం మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తెరుచుకుంది. ఎండల కారణంగా నెల పాటు కొనుగోళ్లు నిలిపివేయగా, సోమవారం నుంచి లావాదేవీలు మొదలవుతాయనే సమాచారంతో రైతులు మిర్చి, తదితర పంటలను తీసుకొచ్చారు. వానాకాలం సీజన్లో పెట్టుబడుల కోసం ఇళ్లు, గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి, పత్తి, పెసలు, కందులను రైతులు, వ్యాపారులు అమ్మకానికి తెచ్చారు. ప్రధానంగా 38లాట్ల ఏసీ మిర్చి విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్టంగా రూ.14,100, మోడల్ ధర రూ.11,300, కనిష్ట ధర రూ.7,500గా పలికింది. ఇక నాన్ ఏసీ మిర్చి 1,500 బస్తాలు రాగా ఽగరిష్ట ధర రూ.13,600, కనిష్ట ధర రూ.4వేలుగా నమోదైంది. అలాగే, పత్తి గరిష్టంగా రూ.6,400, కనిష్టంగా రూ.6వేలు, పెసలకు రూ.6,600, కందులు రూ.4,200, మొక్కజొన్న రూ.1,975 ధర పలి కాయి. మిర్చి, అపరాల యార్డుల్లో మోడల్ మార్కెట్ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యాన కొనుగోళ్లను పత్తియార్డులో నిర్వహించారు.
నిల్వ మిర్చి ధరపై ఆశలు
కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంట సీజన్లో ఆశించిన ధర పలకక చాలామంది తేజా రకం మిర్చిని నిల్వ చేశారు. విదేశాల్లో డిమాండ్ ఉండే తేజా రకం మిర్చికి ఈ ఏడాది సరైన ఆర్డర్లు లేక ధర పలకటం లేదు. అయితే, ఇప్పుడు అన్ సీజన్ కావడంతో ధర వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం సగటున రూ.12,500 వరకు పలుకుతున్న తేజా రకం మిర్చికి మరో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు పెరిగితే చాలా మంది విక్రయించే అవకాశముంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో 40 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా.
ఏసీ మిర్చి క్వింటాకు రూ. 14,100