కూనంనేనికి ఊరట | - | Sakshi
Sakshi News home page

కూనంనేనికి ఊరట

Jun 10 2025 3:42 AM | Updated on Jun 10 2025 3:42 AM

కూనంనేనికి ఊరట

కూనంనేనికి ఊరట

● కొత్తగూడెం ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌ డిస్మిస్‌ ● తీర్పు వెలువరించిన హైకోర్టు ● 2024 జనవరిలో దాఖలైన పిటిషన్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. అంతకుముందు ఏడాదిన్నర పాటు ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి.

గెలిచిన వెంటనే..

అసెంబ్లీ ఎన్నికలు 2023 నవంబర్‌లో జరగగా, నామినేషన్‌ దాఖలు చేసే సమయాన ఫామ్‌–26 అఫిడవిట్‌లో కూనంనేని సమగ్ర వివరాలు వెల్లడించలేదని కొత్తగూడేనికి చెందిన నందూలాల్‌ అగర్వాల్‌ 2024 జనవరి 20న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కూనంనేని తన భార్య పేరును అఫిడవిట్‌లో పేర్కొనలేదని, లైసెన్స్‌డ్‌ నోటరీతో అఫిడవిట్‌ చేయించలేదనే అభ్యంతరాలను నందూలాల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరింత సమాచారం కోసం గతేడాది డిసెంబర్‌లో హైకోర్టు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కూనంనేని సాంబశివరావు సుప్రీంకోర్టును ఆశ్రయించి నందూలాల్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేయాలని కోరారు. అయితే హైకోర్టులో వాదనలు పూర్తి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూనంనేని పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్పోజ్‌ చేసింది. దీంతో అనర్హత కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి ఆరు నెలలుగా కొనసాగింది.

తుది తీర్పు వచ్చాక..

ఏడాదిన్నర వ్యవధిలో ఇటు కమిషన్‌, అటు హైకోర్టులో 20సార్లకు పైగా ఇరువర్గాల నడుమ వాదనలు జరిగాయి. చివరకు ఈ కేసులో తీర్పును ఈనెల 9కి రిజర్వ్‌ చేసినట్టు 7వ తేదీన హైకోర్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో తీర్పు ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రెండురోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. సీపీఐతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కేడర్‌ ఈ తీర్పుపై ఆసక్తి చూపించింది. అయితే నందూలాల్‌ అగర్వాల్‌ లేవనెత్తిన అభియోగాల్లో మెరిట్స్‌ లేనందున పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు సోమవారం హైకోర్టు వెల్లడించింది. దీంతో కూనంనేనికి ఊరట లభించినట్లయింది.

ఖమ్మం మయూరిసెంటర్‌: కూనంనేని సాంబశివరావుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెలువడడంపై సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే, పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు. రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బి.అయోధ్య, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్‌, రాష్ట్రకంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ మౌలా నా, వివిధ ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.

గతంలో వనమాపై..

ఎన్నికల అఫిడివిట్‌లో వివరాలు, అనర్హత అంశంతో కొత్తగూడెం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పేర్కొనలేదంటూ ఆ ఎన్నికల్లో ఓడిపోయిన జలగం వెంకట్రావు 2020లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్ల విచారణ తర్వాత వనమా ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 జూలైలో తీర్పు వెలువడగా.. వనమా సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అక్కడ విచారణ దశలో ఉండగానే 2023 నవంబర్‌ 30న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వనమా ఓడిపోగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఫలితాలు వెలువడిన మరుసటి నెలలో కూనంనేని ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఇక్కడి రాజకీయ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement