
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ప్రజావాణిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ వారం గ్రీవెన్స్ డేకు పెద్దసంఖ్యలో జనం బారులు దీరడంతో కలెక్టర్ వినతిపత్రాలు స్వీకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. శాఖల వారీగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలే తప్ప పెండింగ్ ఉంచొద్దని తెలిపారు. ఏమైనా దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు కొన్ని.....
● ఖమ్మం కాల్వొడ్డులోని హిందూ శ్మశాన వాటిక నిర్వహణ కమిటీ బాధ్యులు మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో తమ 14 షాపులను తొలగించారని తెలిపారు. ఈ షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో మధ్యాహ్న భోజనం, ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నందున ప్రత్యామ్నాయం చూపాలని కోరారు.
● ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన పగడం దేవకర్మ కరోనా సమయం నుంచి స్వీపర్గా పని చేస్తున్న తనను ఇప్పుడు తొలగించినందున ఉపాధి కల్పించాలని విన్నవించారు.
● వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్ల సమస్యపై కలెక్టర్కు ప్రిన్సిపాల్ నవీనజ్యోతి వినతిపత్రం అందజేశారు. దీంతో పనుల పూర్తిపై ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏళ్లుగా తిరుగుతున్నాం...
ఖమ్మం ఇందిరానగర్ – రోటరీనగర్ మధ్యలో నా భార్య మార్తమ్మ పేరుతో 250 గజాల ఇంటి స్థలం ఉండేది. ఈ స్థలం మీదుగా ఏళ్ల క్రితం రహదారి వేశారు. అప్పట్లో ఇంటి స్థలానికి బదులు మరోచోట స్థలం ఇస్తామని అధికారులు లేఖ అందించారు. కానీ అప్పటి నుంచి తిరుగుతున్నా స్పందించడం లేదు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలి.
– మేదరమట్ల వెంకటరత్నం, ఖమ్మం

ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..