
రోడ్డుప్రమాదంలో జీపీ కార్యదర్శి మృతి
పెనుబల్లి/రఘునాథపాలెం: స్కూటీపై విధులకు బయలుదేరిన పంచాయతీ కార్యదర్శిని వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో అదే లారీ టైరు కింద పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పెనుబల్లి మండలం వీఎం బంజర్లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన బానోతు సోనాలి(32) పెనుబల్లి మండలం రామచందర్రావు బంజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సంపత్ది కల్లూరు మండలం లక్ష్మాతండా కాగా వీరికి ఏడాది, నాలుగేళ్ల వయస్సు పిల్లలు ఉన్నారు. కల్లూరు నుంచి రాకపోకలు సాగించే ఆమె రోజులాగే సోమవారం తన స్కూటీపై వెళ్తుండగా అదే మార్గంలో ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న లారీ వీఎం బంజర్ ప్రాథమిక పాఠశాల సమీపాన వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో సోనాలి అదుపుతప్పి రోడ్డుపై పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. సోనాలి మృతిపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సంతాపం తెలపగా, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఎంపీఈఓ ఉపేంద్రయ్య, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.
బూడిదంపాడులో అంత్యక్రియలు
గ్రామపంచాయతీ బానోత్ సోనాలి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆమె స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈసందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ నివాళులర్పించారు. కాగా, పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ కార్యదర్శులపై పనిభారం పెరగడంతో ఆ ఒత్తిడితో వెళ్తున్న ఆమె ప్రమాదం బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాలి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే, పంచాయతీ కార్యదర్శులకు నిర్దిష్ట పనివేళలు, స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, యర్రా రమేష్, కరణ్సింగ్, రుక్మారావు, ఫజల్, వినోద్, గాంధీ, ఉపేందర్, అనిత, సుష్మిత, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
విధులకు వెళ్తుండగా
లారీ ఢీకొనడంతో ఘటన