విపత్తును ఎదుర్కొనేలా.. | - | Sakshi
Sakshi News home page

విపత్తును ఎదుర్కొనేలా..

Jun 8 2025 12:17 AM | Updated on Jun 8 2025 12:20 AM

విపత్

విపత్తును ఎదుర్కొనేలా..

వర్షాల వేళ డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి శిక్షణ
● ముంపు ప్రాంతాల యువతతో బృందాల ఏర్పాటు ● వరద ముప్పును ఎదుర్కొనేలా కేఎంసీ సన్నద్ధత
గత ఏడాది మున్నేటికి వచ్చిన వరద ఖమ్మంలోని పలు కాలనీలను ముంచెత్తగా ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. భారీ మొత్తంలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ చేదు అనుభవం ఈ ఏడాది పునరావృతం కాకుండా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందస్తుగా అవగాహన కల్పించడమే కాక విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్‌

సహాయక చర్యలపై శిక్షణ

వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనేలా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కేఎంసీ అధికారులు శిక్షణ ఇప్పిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రథమ చికిత్స తదితర అంశాలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. అలాగే, గజ ఈతగాళ్లు, బోట్లు నడిపే వారు, మత్స్యకారులు, వరదల్లో చిక్కుకున్న వాహనాలను తొలగించే నైపుణ్యం కలిగిన వారిని బృందాలుగా ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం, త్వరగా స్పందించడంపై అవగాహన కల్పిస్తున్నారు.

స్థానికులకు అవగాహన

వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరద వస్తుందని తెలియగానే వ్యవహరించాల్సిన తీరుపై మున్నేటి పరీవాహక ప్రాంత ప్రజలకు సైతం నగరపాలక సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ వరద హెచ్చరికలను గుర్తించడం, ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలను భద్రపర్చుకోవడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన తీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి శుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలపై వివరిస్తున్నారు. ఈ సదస్సుల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొని స్థానికులకే కాక డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి జాగ్రత్తలను వివరిస్తున్నారు.

ముందస్తు ప్రణాళికలో..

వర్షాకాలం మొదలుకావడంతో అధికారులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య పలు దఫాలుగా ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌ విభాగాల అధికారులతో సమావేశమై వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అవసరమైన పడవలు, రెస్క్యూ బోట్లు, లైఫ్‌ జాకెట్లు, తాళ్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోవడంపై సూచనలు చేశారు. వరద బాధితుల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాల గుర్తింపు, అక్కడ తాగునీరు, ఆహారం సమకూర్చడంపై దృష్టి సారించాలని తెలిపారు. వైద్యబృందాల ఏర్పాటు, అత్యవసర మందుల లభ్యతపై ఆరా తీయడమే కాక వరద తగ్గాక వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలపైనా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు.

పక్కా ప్రణాళికతో...

ఈ ఏడాది మున్నేటి వరదతో సమస్యలు రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభావిత డివిజన్ల యువతతో బృందాలను ఏర్పాటు చేశాం. దీంతో వారికి సమాచారం ఇచ్చి స్థానికులను అప్రమత్తం చేయించొచ్చు. వరద సహాయక చర్యల కోసం ఐదు ర్యాప్‌ బోట్లు కొనుగోలు చేస్తున్నాం. అంతేకాక రెండు డ్రోన్లు సమకూర్చున్నాం.

– అభిషేక్‌ అగస్త్య, కమిషనర్‌, కేఎంసీ

విపత్తును ఎదుర్కొనేలా..1
1/3

విపత్తును ఎదుర్కొనేలా..

విపత్తును ఎదుర్కొనేలా..2
2/3

విపత్తును ఎదుర్కొనేలా..

విపత్తును ఎదుర్కొనేలా..3
3/3

విపత్తును ఎదుర్కొనేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement