
పొంచి ఉన్న ముప్పు
● వానాకాలంలో అప్రమత్తత తప్పనిసరి ● సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక ● ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అవగాహన
జిల్లాలో కొన్నేళ్లుగా నమోదైన వ్యాధుల వివరాలు
ఏడాది డెంగీ మలేరియా చికున్గున్యా
2022 711 02 98
2023 530 – –
2024 529 – –
2025 03 – –
(ఇప్పటివరకు)
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే వర్షాకాలం సీజన్ పూర్తిస్థాయిలో మొదలుకానుంది. అయితే, వర్షాల కారణంగా రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు పెరిగితే వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యాన జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలోని సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాల పరిధిలో వ్యాధుల కట్టడికి వివిధ శాఖలతో కలిసి సంయుక్త కార్యాచరణకు సమాయత్తమైంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో డెంగీ, మలేరియా, చికున్గున్యా, విషజ్వరాలు వంటివి ప్రబలే ప్రమాదముంది. అయితే, వ్యాధుల వ్యాప్తి మొదలుకాక ముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాప్తి చెందిన తర్వాత కట్టడి చేయడం కంటే ముందుగా మేల్కొంటే మంచిదని అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లతో పాటు పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని చెబుతూ.. జిల్లాలో గతంలో కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఇప్పటి వరకై తే తక్కువే..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకై తే వ్యాధుల వ్యాప్తి తక్కువే. వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, విషజ్వరాలు నమోదైనా అంతగా ప్రభావం కనిపించలేదు. అలాగే డెంగీ కూడా ఇప్పటి వరకు మూడు కేసులే నమోదయ్యాయి. ఇక మలేరియా, చికున్గున్యా కేసులు ఒక్కటీ రాలేదు. కానీ గతంలో జిల్లాలో డెంగీ వైరస్ ప్రభావం తీవ్రంగా చూపించింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 529 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారు ఆస్పత్రుల్లో సంప్రదిస్తున్నా ఇబ్బందికర పరిస్థితులైతే లేవు. కానీ మున్ముందు డెంగీ కేసులు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చర్యలు చేపడుతూనే ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు.
ఇదీ ముందస్తు ప్రణాళిక
ఖాళీ స్థలాలు, సైడ్ డ్రెయిన్లు, కుండలు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ ప్రతీ గ్రామం, డివిజన్లలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో టిమోపాస్, ఆయిల్ బాల్స్ వేస్తారు. టైర్లు, పాత సామగ్రి, కొబ్బరి బొండాల షాపుల యజమానులను అప్రమత్తం చేసి ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేస్తే ఎదురయ్యే అనర్థాలను వివరిస్తారు. జ్వరం వచ్చిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్లు, సమీప నివాసాల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్ఆర్టీ బృందాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పాజిటివ్ కేసుల సిరమ్ షాంపిళ్లు సేకరించడమే కాక అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.

పొంచి ఉన్న ముప్పు