
విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి
కూసుమంచి : విపత్తులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత అధికారులను కోరారు. కూసుమంచి రైతువేదికలో గురువారం విపత్తుల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు, సిబ్బంది సమన్వయంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తే నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. జిల్లా స్థాయి నుంచి ప్రమాద హెచ్చరికలు రాగానే ప్రతిస్పందిచాలని, వరదల సమయాల్లో ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, వైద్యాధికారి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించగా మిల్లర్లు అధికంగా కోత పెడుతున్నారని పలువురు రైతులు శ్రీలతకు ఫిర్యాదు చేశారు. దీంతో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఏపీఎం తిరుమలరావుకు ఆమె సూచించారు.