
ఉన్నత ఆశయంతో ఇందిరా డెయిరీ
మధిర: మహిళలను ఆర్థికంగా తీర్చిదిద్దాలన్న ఉన్నతాశయంతో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుచేస్తున్నామని, అధికారులు సమన్వయంతో దీన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిరలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఇందిరా డెయిరీ ద్వారా లబ్ధిదారులకు రెండేసి గేదెలు అందజేయాలని, ఇందుకోసం సభ్యులు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదనే విషయమై అవగాహన కల్పించాలన్నారు. అలాగే, భూమి లేకున్నా అర్హులేనని.. అసలే గేదెలు లేనివారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రానున్న ఐదు నెలల్లో లబ్ధిదారులకు గేదెలు అందించేలా కొనుగోలుపై దృష్టి సారించాలని భట్టి సూచించారు.
● ఈనెల 8న నిర్వహిస్తున్న మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈకార్యక్రమంలో మిరియాల రమణగుప్తా, మొండితోక సుధాకర్, అద్దంకి విప్లవకుమార్, బెజవాడ రవి, శీలం వెంకటరెడ్డి, మక్కెన నాగేశ్వరరావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
● తొలి తరం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, రమావత్ బాబురావు తదితరులు మాట్లాడారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న తాము అనేక సమస్యలతో బాధపడుతున్నందున ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని విన్నవించారు.
● ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని 31 జీపీల్లో తెనుగోళ్లు, మున్నూరు కాపు కులస్తులకు రాజీవ్ యువ వికాసం యూనిట్లు కేటాయించలేదని సంఘం మండల బాధ్యులు నాయకులు సూరంశెట్టి భాస్కరరావు, కడియం శ్రీనివాసరావు, మల్లెల లక్ష్మణరావు తెలిపారు. ఈమేరకు బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజ్మమిల్ఖాన్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. నాయకులు పసుపులేటి వెంకటనారాయణ, గంధం శ్రీనివాసరావు, తోట సాంబశివరావు, పసుపులేటి మహేష్, శ్రీపాలశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క