
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం నేలపట్ల, మల్లేపల్లి, జక్కేపల్లి ఎస్సీకాలనీ, పాలేరులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు. ఆతర్వాత సాయంత్రం 4గంటలకు ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, పెద్దతండా, గొల్లపాడు, కరుణగిరిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి, మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు, మారెమ్మ ఆలయం – కేంద్రియ విద్యాలయం రోడ్డుపై వీధి దీపాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
‘భూ భారతి’ సదస్సులు సద్వినియోగం చేసుకోండి
బోనకల్: భూసమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లాలో రెండో విడతగా బోనకల్ మండలాన్ని ఎంపిక చేయగా, తొలిరోజు మండలంలోని గార్లపాడులో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ జి.నరసింహారావు మాట్లాడుతూ భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ దరఖాస్తుల స్వీకరణకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, గ్రామంలో భూసమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు అందగా, కేటగిరీల వారీగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. తహసీల్ధార్ పున్నంచందర్, ఆర్ఐలు నవీన్, మైథిలి, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రారంభమైన
స్పాట్ వాల్యూయేషన్
ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. ఖమ్మంలోని రోటరీనగర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన క్యాంప్నకు డీఈఓ సామినేని సత్యనారాయణ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవా రం క్యాంప్ను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకాగా, ఇంటర్ మూల్యాంకనం ఈనెల 8న ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాకు 18,999 ఇంటర్మీడియట్ జవాబుపత్రాలు, 11,118 పదో తరగతి జవాబు పత్రాలు వచ్చాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పాల్గొన్నారు.
ముత్తంగి అలంకరణలో
భద్రాద్రి రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన