
ఐటీ హబ్లో 2నుంచి నైపుణ్య శిక్షణ
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ఐటీ హబ్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యాన నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. జావా ఫండమెంటల్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ డేటాబేస్, క్లౌడ్ కంప్యూటింగ్, టాలీ జీఎస్టీ, ఐటీ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకోసం రూ.599 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఆరు నెలల వ్యవధిలో అభ్యర్థులకు అనుకూలమైన సమయంలో శిక్షణకు హాజరుకావొచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 95025 05880 నంబర్లో సంప్రదించాలని వారు ఓ ప్రకటనలో సూచించారు.
నూరు శాతం వ్యాక్సినేషన్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని చిన్నారులకు నూరు శాతం వ్యాక్సినేషన్ నిర్వహించాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి ఆదేశించారు. ఖమ్మంలో గురువారం మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు రోటా వైరస్, ఇతర వ్యాక్సిన్లపై ఏర్పాటుచేసిన ఓరియేంటేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 97శాతం వ్యాక్సినేషన్ పూర్తయినందున, 100 శాతానికి సిద్ధం కావాలని తెలిపారు. ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు సంయుక్తంగా తల్లిదండ్రులను కలిసి ఎనిమిది ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించేలా వేస్తున్న వ్యాక్సిన్పై అవగాహన కల్పించడంతో పాటు వారిలో అపోహలు తొలగించాలని సూచించారు. అంతేకాకుండా అన్ని వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డబ్ల్యూహెచ్ఓ శిక్షకులు మురహరి మాట్లాడగా వివిధ విభాగాల అధికారులు రామారావు, సుబ్రహ్మణ్యం, శేషురత్నం, రమణ పాల్గొన్నారు.
ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మహిళా మత్స్యకారులకు మూడు రోజుల పాటు శిక్షణ గురువా రం ప్రారంభమైంది. ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, హైదరాబాద్, వికారా బాద్ జిల్లాల మహిళా మత్స్యకారులు పాల్గొనగా.. చేప, రొయ్యల పచ్చడి తయారీని శిక్షకులు వివరించారు. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులునాయక్ మాట్లాడుతూ మహిళలు శిక్షణను సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మత్స్య శాస్త్రవేత్త వీరాంజనేయులు చేపలతో తయారుచేసే ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఫిష్ బాల్స్, సమోసా, పాపడ్, కట్లెట్, లాలీపాప్స్, బర్గర్ల తయారీతో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. పాలేరు ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఐటీ హబ్లో 2నుంచి నైపుణ్య శిక్షణ