ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర

May 30 2025 12:16 AM | Updated on May 30 2025 12:16 AM

ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర

ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర

● అటవీ సంపదను సంపన్నులకు దోచిపెట్టే ప్రయత్నం ● ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క

పాల్వంచరూరల్‌ : ఆదివాసీ జాతిని అంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆదివాసీ సమ్మేళనాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మణిపూర్‌, అసోం, నాగాలాండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ల్లో ఆది వాసీలపై కేంద్ర ప్రభుత్వం పలు ఆపరేషన్ల పేరుతో దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే స్థానిక గిరిజనులతో గ్రామసభలు నిర్వహించి అమోదించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండానే మోడీ ప్రభుత్వం ఖరీదైన అటవీ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, ఎదురుతిరిగిన వారిపై నక్సలైట్లు అనే ముద్ర వేసి అడ్డు తొలగిస్తోందని ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీడీఏలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నాడు రద్దు చేసిన జీఓలను తిరిగి తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని వివరించారు.

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలి..

రాజ్యాంగ పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలని మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరామ్‌ నాయక్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోదండరామ్‌ మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని, ఇలాంటి శిక్షణ తరగతుల్లో వాటి గురించి తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా అమలు చేయకుండా బీజేపీ సొంత ఎజెండా అమలు చేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివాసీల హక్కులు, సంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. కాంగ్రెస్‌తోనే సామాన్యులకున్యాయం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గిరిజన హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ బాబూరావు, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ రాహుల్‌ బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement