విపత్తు ఎదురుకాకుండా.. | - | Sakshi
Sakshi News home page

విపత్తు ఎదురుకాకుండా..

May 30 2025 12:16 AM | Updated on May 30 2025 12:16 AM

విపత్తు ఎదురుకాకుండా..

విపత్తు ఎదురుకాకుండా..

● విత్తన తనిఖీలకు 21టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ● పోలీస్‌, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటు ● ఏ ఒక్క రైతు మోసపోకుండా తనిఖీలు, నిఘా

ఖమ్మంవ్యవసాయం: ముందస్తు వర్షాలతో వానాకాలం సాగు పనులు మొదలయ్యాయి. ఈనేపథ్యాన రైతులు అవసరమైన విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎక్కడా అక్రమాలు జరగకుండా, నకిలీలు మార్కెట్‌లోకి రాకుండా ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయగా.. వారు షాపుల్లో తనిఖీలు కూడా చేస్తున్నారు. ఇదే సమయాన రైతులు మోసపోకుండా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

సీజన్‌ వస్తే చాలు...

వ్యవసాయ సీజన్‌ మొదలైందంటే చాలు పలుచోట్ల దళారులు రంగప్రవేశం చేస్తారు. ఇతర జిల్లాలకు చెందిన పలువురు రాత్రి వేళ గ్రామాల్లో తిరుగుతూ తమ వద్ద ఉన్న విత్తనాలు అధిక దిగుబడులు ఇస్తాయని నమ్మిస్తూ రైతులకు అంటగడుతుంటారు. అయితే, వీటికి రశీదు ఇవ్వకపోగా ఎవరు అమ్మారో కూడా గుర్తించలేని పరిస్థితులతో రైతులు నష్టపోవడం ఆనవాయితీగా మారింది. ప్రధానంగా పత్తి, మిర్చి విత్తనాల మోసం తరచూ జరుగుతోంది. ఇక కొందరు లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు సైతం అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తూ జైలు పాలయ్యారు. గత ఏడాది 300మందికి పైగా రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. దీంతో దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తుగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుకు ఆదేశించింది. నకిలీ, అనుమతులు లేని విత్తనాలతో ఎవరూ నష్టపోకుండా ప్రాథమిక దశ నుంచే తనిఖీల కోసం ఈ బృందాలను నియమించడంతో వారు పని మొదలుపెట్టారు.

మండలానికి ఒక బృందం

జిల్లాలోని 21 మండలాలకు ఒక్కో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించారు. ఈ బృందానికి మండల వ్యవసాయాధికారి, మండలంలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నేతృత్వం వహిస్తారు. వీరి సూచనలతో గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తర్ణాధికారులు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విత్తన షాపుల్లో తనిఖీలు చేయనున్నారు.

విత్తన విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్‌

వానాకాలం సీజన్‌ ప్రారంభమవడంతో విత్తనాల విక్రయానికి వ్యవసాయ శాఖ అనుమతించింది. ఇటీవల డీలర్ల సమావేశంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ దిశానిర్దేశం చేశారు. విత్తన విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది 2.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా 6.40 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని చెబుతున్నారు. ఇందులో 4.28 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. 450 గ్రాములు ఒక్కో విత్తన ప్యాకెట్‌ ధర రూ.901గా నిర్ణయించారు.

విత్తన విక్రయాలపై పటిష్ట నిఘా..

నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాం. ఎవరైనా విత్తన మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. రైతులు కూడా లైసెన్స్‌డ్‌ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి పూర్తి వివరాలతో రశీదు తీసుకోవాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement