
ఏదీ ముందస్తు సన్నద్ధత?
గుర్తించడం ఎలా?
జిల్లాలో కరోనా వ్యాప్తి చెందితే గుర్తించే పరిస్థితులు లేవు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో వస్తే సాధారణ పరీక్షలే నిర్వహిస్తున్నారు. కోవిడ్ను గుర్తించేందుకు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాల్సి ఉన్నా ఏ ఆస్పత్రిలో కూడా కిట్లు అందుబాటులో లేవు. కరోనా వ్యాప్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ఇంత వరకు తీసుకోలేదు. కోవిడ్ సన్నద్ధతపై తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతుండడం గమనార్హం. పరీక్షల కోసం ర్యాపిడ్ కిట్లు 3వేలు కావాలని ప్రతిపాదించినా జిల్లాకు చేరలేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించే పరిస్థితి కూడా లేదు. ఈ పరీక్షలు గతంలో జిల్లా ఆస్పత్రిలో మాత్రమే నిర్వహించగా నివేదిక కచ్చితత్వంతో వస్తుంది. కానీ ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి లేకపోవడంతో ఇండెంట్ పంపించి వదిలేశారు.
వార్డు ఏర్పాటుతో సరి
కరోనా వ్యాప్తి సూచనలతో అధికారులు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇరవై పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. వార్డు ఏర్పాటుచేసినా కిట్లు లేకపోవడంతో బాధితులను గుర్తించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కరోనా వ్యాప్తి సమయాన ప్రభుత్వ పరంగా లక్షలాది పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు కలిపి 18,64,446 మందికి నిర్వహించారు. అందులో 1,10,395 మందికి కోవిడ్ సోకినట్లు తేలగా, పరిస్థితి విషమించిన 1,447 మంది మృత్యువాత పడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
నిరుపయోగంగా ప్లాంట్
కరోనా రెండో వేవ్ సమయాన ఆక్సీజన్ కొరత ఏర్పడింది. అప్పుడు గాలి నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ను పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1.20 కోట్లతో ఏర్పాటుచేసిన కాన్సంట్రేటర్ ప్లాంట్ 2021 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురిచేసి నైట్రోజన్, కార్బన్ డై ఆకై ్సడ్ తదితర వాయువులు, ఆక్సిజన్ను ఈ ప్లాంట్లో వేరు చేస్తారు. గంటకు 2వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంట్ నిర్వహణను కరోనా వ్యాప్తి తగ్గాక పట్టించుకోలేదు. ఆస్పత్రి అవసరాలకు ఉపయోగించుకునే వీలున్నా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు విలు వైన ప్లాంట్ తుప్పుపట్టే పరిస్థితికి చేరింది.
జిల్లా ప్రజల్లో కరోనా భయం
అందుబాటులో లేని పరీక్షల కిట్లు
ఉపయోగంలో లేని ఆక్సిజన్ ప్లాంట్
తగిన జాగ్రత్తలు పాటించాలి..
ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి లేదు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన సన్నద్ధతపై ఆదేశాలు లేకున్నా పరీక్షల కోసం కిట్లు పంపించాలని కోరాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించ డమే కాక తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి.
– బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ

ఏదీ ముందస్తు సన్నద్ధత?