పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు

May 30 2025 12:16 AM | Updated on May 30 2025 12:16 AM

పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు

పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు

ఖమ్మం సహకారనగర్‌: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో భట్టితో పాటు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఽవర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, సాగు ప్రణాళికలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తొలుత ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ ఖాన్‌, జితేష్‌ వి.పాటిల్‌ జిల్లాల వారీగా పథకాలు అమలు నివేదికలు వెల్లడించారు.

నకిలీలు అమ్మితే కఠిన చర్యలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోకి నకిలీలు రాకుండా ఏపీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అలాగే, భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై సూచనలు చేశారు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తొలి దశలో అరికట్టడమే కాకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేయాలని, జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఆశాజనకంగానే ఉన్నా మరింత పెరగాలని సూచించారు. ఇక రుతుపవనాలు ముందుగా వచ్చినందున సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చాలని తెలిపారు.

ఎక్కడా కొరత రావొద్దు

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు. నిల్వలను తరచుగా పరిశీలిస్తూ ఎక్కడా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా చూడాలని సూచించారు.

అనర్హులు ఉంటే అధికారులపై చర్యలు

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసైన్డ్‌ భూముల్లో పొజిషన్‌లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నందున ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే, సాదా బైనామా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని తెలిపారు. కాగా, జూన్‌ 3నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. కాగా, జూన్‌ 10 లోపు పైలట్‌ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు అవసరమైన ఇసుక టోకెన్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు. అంతేకాక సగంలో మిగిలిపోయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కూడా పూర్తిచేయించాలన్నారు.

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు

ఉచితంగా ఇసుక

ఏ ఒక్క అనర్హుడికి ఇల్లు దక్కినా

బాధ్యులపై చర్యలు

ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక దృష్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి

ఇంకా ఎవరేం అన్నారంటే....

ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు మరోమారు జరగకుండా ప్రణాళిక రూపొందించాలని కోరారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కింద బేస్‌మెంట్‌ స్థాయి వరకు నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరారు. అలాగే, ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులను కేటాయించాలని సూచించారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించటంతో పాటు వైద్యులను, సిబ్బందిని పెంచాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని.. ఎమ్మెల్యేల సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా ఇందిరమ్మకమిటీలు, అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇంకా సమావేశంలో ఖమ్మం పోలీస్‌ కమి షనర్‌ సునీల్‌దత్‌, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్‌ రాజ్‌, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌, డీఆర్వో ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement