రేక్‌ పాయింట్‌కు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌కు లైన్‌ క్లియర్‌

Mar 19 2025 12:06 AM | Updated on Mar 19 2025 12:06 AM

రేక్‌ పాయింట్‌కు లైన్‌ క్లియర్‌

రేక్‌ పాయింట్‌కు లైన్‌ క్లియర్‌

● పందిళ్లపల్లిలో ఎరువుల దిగుమతికి ‘కోడ్‌’ కేటాయింపు ● కంపెనీల సానుకూలతతో త్వరలోనే రవాణా

ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లిలో ఎరువుల రేక్‌ పాయింట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. వివిధ కంపెనీలు ఎరువులు సరఫరా చేసేలా కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ తాజాగా ‘కోడ్‌’ కేటాయించింది. గతంలో ఖమ్మం రైల్వేస్టేషన్‌ కేంద్రంగా రేక్‌ పాయింట్‌ కొనసాగగా, కాజీ పేట–విజయవాడ మధ్య మూడోలైన్‌ ఏర్పాటు పనులతో తొలగించి పందిళ్లపల్లి స్టేషన్‌కు మార్చింది. అయితే, అనుమతుల్లో జాప్యం జరుగుతుండగా దాదాపు మూడు నెలలుగా రైల్వేవ్యాగన్ల ద్వారా ఎరువుల సరఫరా నిలిచిపోయింది. దీంతో వరంగల్‌, మిర్యాలగూడ రేక్‌ పాయింట్ల నుంచి ఇక్కడకు ఎరువుల సరఫరా చేసి కేంద్రాలకు చేరవేస్తున్నా అక్కడక్కడా కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కోడ్‌ కేటాయించిన నేపథ్యాన ఖమ్మం బదులు పందిళ్లపల్లికి ఎరువుల దిగుమతికి అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే లారీ అసోసియేషన్‌ బాధ్యుల సమస్యలు పరిష్కారం కాగా, హమాలీల సమస్య కూడా త్వరలో ఓ కొలిక్కి రానుంది.

నిల్వల కోసం ఎదురుచూపులు

రానున్న వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎరువులు నిల్వ చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఏటా యాసంగి సీజన్‌ తర్వాత మార్చి నెల నాటికే దాదాపు 30 నుంచి 40 వేల మెట్రిక్‌ టన్నుల వివిధ కంపెనీలకు సంబంధించి యూరియా నిల్వ చేస్తారు. మే నెల నాటికి ఇది 70 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుతుంది. కానీ ఈసారి రేక్‌ పాయింట్‌ మారడం, అనుమతుల్లో జాప్యంతో నిల్వ చేయలేదు. పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌ నుంచే ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు ఎరువులు సరఫరా చేయనుండగా.. మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, 40 శాతం డీలర్లకు కేటాయిస్తారు.

ముందుకొస్తున్న కంపెనీలు

పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు అనుమతులు వచ్చిన నేపథ్యాన ఎరువులు సరఫరా చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలోనే క్రిబ్‌కో, రామగుండం కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీల యూరియా దిగుమతి జరగనున్నట్లు తెలిసింది. ఒక్కో రైల్వే వ్యాగన్‌లో దాదాపు 3వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానుండగా, నెలకు 20 నుంచి 25 వ్యాగన్లు వచ్చే అవకాశముంది. దీంతో వానా కాలం సీజన్‌కు కావాల్సిన ఎరువులు నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేస్తున్నారు. కాగా, పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు కోడ్‌ కేటాయించిన నేపథ్యాన ఎరువులతో పాటు ఎఫ్‌సీఐ తరఫున బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల ఎగుమతి, దిగుమతికి కూడా అవకాశం లభించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement