హొసపేటె: ప్రజాస్వామ్యంలో సమాచార హక్కుచట్టంపై ప్రజలకు అవగాహన అవసరమని కర్ణాటక సమాచార కమిషన్ అధికారి వెంకటసింగ్ తెలిపారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో స.హ.చట్టం గురించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి, సామాన్యుడికి పాలనలో భాగస్వామ్యానికి 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. మరి ఆ రాజులకు తమ పరిపాలనలో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు లేదా? అంటే కచ్చితంగా ఉంది. అదే సమాచార హక్కు చట్టమని తెలిపారు. ఆయుధంలా పని చేస్తున్న ఈ చట్టం గురించి తెలుసుకోవడం నేటి మన హక్కు, మన బాధ్యత అని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల పని తీరు గురించి సమాచారం అడిగి తెలుసుకునే చట్టబద్ధమైన హక్కు అని తెలిపారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని. ఇంత వరకు 80 శాతం వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. అధికారులు బద్రుద్దీన్, హరీష్కుమార్, ఏడీసీ లోకేష్, ఏఎస్పీ మంజునాథ్ పాల్గొన్నారు.


