కన్నపేగు కన్నీటి రాత | - | Sakshi
Sakshi News home page

కన్నపేగు కన్నీటి రాత

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

బనశంకరి: ఆడుకుంటున్న పసికందు నీటి బకెట్‌ పడి చనిపోవడంతో తల్లి హృదయం తల్లడిల్లింది. బిడ్డ చావుకు నేనే కారణమనే బాధతో డెత్‌నోట్‌ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెంగళూరులో చంద్రాలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. భైరవేశ్వరనగరలో ప్రతిభ (29), భర్త మహంతేశ్‌, 11 నెలల అగస్త్య అనే కుమారునితో ఉన్నారు. ప్రతిభ సిల్క్‌బోర్డు వద్ద గల ఓ కంపెనీలో టెక్కీగా , వర్క్‌ ఫ్రం హోం కింద పనిచేస్తోంది. భర్త కూడా మరో కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రతిభ ఇంటిపైన ఆరబెట్టిన బట్టలు తీసుకురావడానికి ఒక్కరే వెళ్లింది. ఇంట్లో ఉన్న బాలుడు తప్పటడగులు వేస్తూ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. బకెట్‌లో నీరు నిండుగా ఉండగా అందులోకి పడిపోయాడు. బట్టలు తీసుకువచ్చిన ప్రతిభ చిన్నారిని వెతగ్గా బాత్‌రూం బకెట్‌లో శవమై కనిపించాడు.

భర్త ఇంటికి వచ్చి చూడగా..

దీంతో దిగ్భ్రాంతికి గురైంది. భర్త సాయంత్రం 6.30 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి చేరుకోగా డోర్‌ లోపలి నుంచి లాక్‌ చేసి ఉంది. తన వద్ద ఉండే తాళం చెవితో తీసి వెళ్లగా ఉయ్యాలకు వేసిన చీరతో ప్రతిభ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఆమె చేతినుంచి రక్తం కారుతుండటాన్ని గమనించాడు. ఇక బెడ్‌పై ఉన్న పసికందు అగస్త్య నిద్రపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించాడు.

మాత్రలు మింగి, చేయి కోసుకుని..

బెడ్‌పైన డెత్‌నోట్‌ లభించింది. ‘నా చావుకు నేనే కారణం, అగస్త్య ను కాపాడుకోవడం సాధ్యం కాలేదు, దీంతో నేను ఆత్మహత్య చేసుకున్నాను’ అని అందులో ప్రతిభ రాసింది. ఉరివేసుకోవడానికి ముందు ఆమె 15 పారాసిటమాల్‌ మాత్రలు మింగి, కత్తితో చేతిని కోసుకుంది, చివరకు ఉరి బిగించుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణలో ఉందని డీసీపీ యతీశ్‌ తెలిపారు.

బకెట్లో పడి చిన్నారి కొడుకు మృతి

బాధ తాళలేక తల్లి ఆత్మహత్య

మృతురాలు ఐటీ ఇంజనీరు

బెంగళూరులో విషాద సంఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement