ఘనంగా విశ్వేశ్వరస్వామి రథోత్సవం
చింతామణి: చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామ వ్యాప్తిలోని మజరా దిగువకోటలో వెలసిన పురాతన పుణ్యక్షేత్రమయిన శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయ రథోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ఉదయం నుంచి స్వామివారిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. పండితులు అభిషేకం, హోమాలు నిర్వహించారు. స్వామి ఉత్సవ విగ్రహాలను తేరులో ప్రతిష్టించి ఊరేగించారు.
చిన్నస్వామిలో ద్రవిడ్,
కుంబ్లే స్టాండ్లు
బనశంకరి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మైదానంలో ప్రేక్షకుల స్టాండ్లకు ప్రముఖ మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్కుంబ్లే, శాంత రంగస్వామి పేర్లను పెట్టారు. వీరు కన్నడిగులే కాకుండా ఇదే స్టేడియంలో ఆడి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ మేరకు కేఎస్సీఏ వారికి ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి రాహుల్ ద్రవిడ్ హాజరై ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు, తన తండ్రికి గర్వంగా ఉంటుందని పేర్కొన్నారు.
సుప్రీంలో యత్నాళ్కు ఊరట
● ప్రత్యర్థి పిటిషన్ కొట్టివేత
హుబ్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్కు సుప్రీంకోర్టులోను ఊరట దక్కింది. ఆయన ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని పరాజిత కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ హమీద్ దాఖలు చేసిన రిట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. యత్నాళ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలురకాల అక్రమాలకు పాల్పడి గెలిచారని అబ్దుల్ హమీద్ ఆరోపణలు చేశారు. ఈ రిట్ను కలబుర్గి హైకోర్టు పీఠం గతంలో డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో మరో రిట్ దాఖలు చేసినా ఫలితం దక్కలేదు. సుప్రీం కోర్టు రిట్ను తిరస్కరిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యత్నాళ్ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.


