
నకిలీ వైద్యులపై దాడులు
హొసపేటె: తాలూకాతో పాటు కమలాపుర పట్టణంలో నకిలీ వైద్యులపై ఆరోగ్య శాఖ అధికారులు శనివారం దాడులు చేశారు. కమలాపురలో అస్లాం బాషా అనే నకిలీ వైద్యుడికి చెందిన సఫా క్లినిక్పై జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్నాయక్, జిల్లా ఆయుష్ అధికారులు, తాలూకా ఆరోగ్య అధికారుల నేతృత్వంలోని అధికారుల బృందం దాడి చేసింది. పరారీలో ఉన్న అస్లాం బాషా, అతనికి ఆశ్రయం ఇచ్చిన విజయనగర మెడికల్ షాప్ యజమానికి ఫోన్లో పలు సార్లు సంప్రదించినా వారు కాల్కు స్పందించడానికి నిరాకరించారు. వెంటనే కర్ణాటక ప్రైవేట్ వైద్య సంస్థల(కేపీఎంఈ–2007) చట్టం కింద కమలాపుర పోలీస్ స్టేషన్ సిబ్బందితో సఫా క్లినిక్ను సీజ్ చేశారు. అదేవిధంగా డాక్టర్ సుహాస్ అనే వైద్యుడు కూడా కేపీఎంఈలో నమోదు చేసుకోకుండా, హోమియోపతికి లైసెన్స్ పొందకుండా అల్లోపతి సేవలను అందించినందుకు నోటీసు జారీ చేశారు. పట్టణంలోని మరో క్లినిక్ను తనిఖీ చేసినప్పుడు అక్కడ డాక్టర్ మనోహర్ క్లినిక్లోని బయో మెడికల్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించనందుకు నోటీసు జారీ చేసినట్లు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్ నాయక్ తెలిపారు.
ఈద్ విందుకు ఎమ్మెల్యే
బళ్లారిఅర్బన్: స్థానిక ముస్లిం నేత ఖాజిగులాం మహమ్మద్ సిద్దిఖి నివాసంలో ఈద్ మిలాద్ విందు నిర్వహించగా, ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముస్లిం ప్రముఖులు ఘనంగా సన్మానించారు. హుమాయూన్ ఖాన్, ప్రభంజన్కుమార్, ప్రముఖులు జబ్బార్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతులకు
గౌరవధనం అందించాలి
రాయచూరు రూరల్: సంచార జాతులకు గౌరవధనం అందించాలని ఆ జాతుల సాంస్కృతిక సాహిత్య పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం కలబుర్గిలోని మినీ విధానసౌధ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు దొడ్ల పండరి మాట్లాడారు. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బళ్లారి, విజయనగర, బీదర్ జిల్లాల్లోని సంచార జాతులకు గౌరవధనం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదిలో ఏడు రోజులు మాత్రమే ఊరూరా తిరిగి జోకుమారను బుట్టలో పెట్టుకొని భిక్షం అడిగే వారికి సర్కార్ గౌరవధనం ఇచ్చేలా చూడాలని కోరుతూ జిల్లాధికారిణి ఫౌజియ తరన్నుమ్కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో జయశ్రీ,రాజ్, అర్జున్, శరణప్ప, సూర్యకాంత్, సాబణ్ణ, ఇందుబాయి, హెన్నమ్మ, రవిలున్నారు.
సాంస్కృతిక రాయబారి బసవణ్ణ
రాయచూరు రూరల్: సాంస్కృతిక రాయబారి బసవణ్ణ అని సాణేహళ్లి పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ అన్నారు. శుక్రవారం రాత్రి గంజ్ కళ్యాణ మంటపంలో బసవ సంస్కృతి అభియాన్ ముగింపు సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బసవణ్ణ ఆదర్శాలను, ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో అలవరచుకోవాలన్నారు. ప్రపంచంలో అశాంతి విలయ తాండవం చేస్తోందన్నారు. దానిని శాంతింప చేయడానికి అందరూ ఏకం కావాలన్నారు. పుణ్యంతో కూడిన పనులు చేపట్టడానికి అనుభవ మంటపం ప్రధానమని అభిప్రాయపడ్డారు. పేదలకు సహాయ సహకారాలు అందించి అందరి మనస్సులను గెలవాలన్నారు. లింగాయత మఠాధిపతులు వేదిక ఆధ్వర్యంలో జరిగే బసవ సంస్కృతి అభియాన్కు అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో బసవలింగ పట్టదేవరు, తోంటద సిద్దరామ, సిద్దలింగ, గురు బసవ, మహాలింగ స్వామీజీ, చంద్రశేఖర్, నాగరాజ్, శరణ భూపాల్ నాడగౌడ, నాగనగౌడ, లలితలున్నారు.
సహకార సంఘం
వార్షిక సమావేశం
బళ్లారిఅర్బన్: స్థానిక పార్వతి ఫంక్షన్ హాల్లో శనివారం వరద వినాయక క్రెడిట్ సహకార సంఘం 14వ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు జేఎస్ నేపాక్షప్ప, ఆ సంఘం ప్రముఖులు ఎన్.అయ్యప్ప, సీనియర్ న్యాయవాదులు, డైరెక్టర్లు, సంస్థ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గత ఏడాది నివేదికను వివరించారు. 2024–25వ సంవత్సరంలో సంఘం మొత్తం రూ.1.06 కోట్ల నికరలాభం సాధించిందన్నారు. ఆ మేరకు సంఘం సభ్యులకు 24 శాతం లాభాలు ఇస్తామని ప్రకటించారు. సంఘం మొత్తం ప్రణాళిక వివరాలను సమావేశం ఆమోదించింది. సమావేశంలో సంఘం ప్రముఖులు వీకే.భాస్కరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ నేత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి, డైరెక్టర్లు ఉడేద బసవరాజ్, వీ.ఆంజనేయులు, బాలనగౌడ, సురేఖ పాటిల్, సుమారాణి, పుష్పవతి, జ్యోతి, దొడ్డమహేష్, ఈరప్ప, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ వైద్యులపై దాడులు

నకిలీ వైద్యులపై దాడులు