
బాలునిపై వీధికుక్క దాడి
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని సొమినకొప్ప ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళుతున్న బాలునిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచింది. మహమ్మద్ తమీమ్ అనే నాలుగేళ్ల బాలునికి పెదవి దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు మెగ్గాన్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కుక్క బాలున్ని కరుస్తుండగా స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలున్ని రక్షించారు. సొమినకొప్ప ప్రాంతంలో వీధికుక్కల బెడద అధికమైందని, నిరంతరం పశువులపై దాడి చేస్తున్నాయని ప్రజలు వాపోయారు. పురపాలక అధికారులు వీధికుక్కలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.
కారు ప్రమాదంలో
నలుగురు మృత్యువాత
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వేలో జరిగింది. జయపుర బ్రిడ్జ్ వద్ద అతి వేగం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొంది. మండ్య జిల్లా కేఆర్ పేటకు చెందిన ముత్తురాజు (55), తమ్మనగౌడ (27) , సంజు (28), కారు డ్రైవర్ సచిన్ (27) తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయారు. రామనగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వేధిస్తోందని..
కత్తితో పొడిచా
● టీవీ నటి శ్రుతి భర్త వెల్లడి
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీలు, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
భర్త వద్దని.. ప్రియుని చెంతకు
● రంపచోడవరం టు కొప్పళ
రాయచూరు రూరల్: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను భర్తతోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుంది.

బాలునిపై వీధికుక్క దాడి

బాలునిపై వీధికుక్క దాడి

బాలునిపై వీధికుక్క దాడి