
అలసిపోతోన్న గుండె
శివాజీనగర: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి, ఆదివారం మైసూరులో ఇద్దరు, దావణగెర, గదగ, బెంగళూరులో ఒకరు చొప్పున 5 మంది చనిపోయారు.
● మైసూరులో ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ (44) బస్సులో ప్రయాణిస్తూ ఉండగా గుండెపోటు అని కూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయారు. ఆయన స్వస్థలం మండ్య జిల్లాలోని కిలారి గ్రామం.
● మైసూరు జిల్లాలోని టీ.నరసీపుర దేవాలయ ప్రధాన అర్చకుడు సంపత్కుమార్కు అర్ధరాత్రి తీవ్ర గుండెపోటు వచ్చి మరణించారు.
● దావణగెరెలో శక్తినగరకు చెందిన అనిల్కుమార్ (40) వాకింగ్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయాడు. అక్కడి సీసీ కెమెరాలలో ఇది రికార్డయింది. కొంతసేపటికే చనిపోయాడు.
● బెంగళూరులో డ్యాన్స్ చేస్తూ ప్రైవేటు ఉద్యోగి ఉసురు పోయింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా సర్జాపురవాసి బసవరాజ్ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుండేవాడు. మిత్రులతో కలసి రిసార్ట్కు వచ్చి మజా చేస్తుండగా ఘోరం జరిగింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
● గదగ్ జిల్లా లక్ష్మేశ్వరకు చెందిన శోభా వడకణ్ణవర్ (42) మరణించారు, ఎద నొప్పి అని చెప్పడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు, తరువాత హుబ్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
వివిధ ప్రాంతాల్లో 5 మంది మృత్యువాత