
శారీరక దృఢత్వం.. అదే ఆరోగ్య సూత్రం
హుబ్లీ: పోలీస్ శాఖకు స్థూలకాయం తలనొప్పి తెప్పిస్తోంది. కొందరు పోలీస్ సిబ్బంది ఇంతింత పొట్టలతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో వారి పొట్టలను కరిగించేందుకు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషరేట్ దేహదండన శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా బొజ్జదేహాలు ఉన్న సిబ్బందికి వాటిని కరిగించే ప్రక్రియ మొదలైంది. విధుల్లో ఉన్న పోలీసులు ఫిట్ అండ్ ఫైన్(శారీరకంగా దృఢంగా)గా కనిపించడానికి జంట నగరాల్లో డ్యూటీలో ఉన్న 98 పోలీస్ సిబ్బందిని స్థూలకాయలుగా గుర్తించారు. బాడీ మాథ్ ఇండెక్స్(బీఎంఐ) పరీక్ష ద్వారా అలాంటి వారిని గుర్తించి మూడు నెలల లోపల స్థూలకాయం తగ్గించాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు. గోకుల్ రోడ్డు కొత్త సీఏఆర్ మైదానంలో శాఖ సిబ్బందికి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు శారీరక వ్యాయామాలు చేయించి దేహం తూకం తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకు జంట నగరాలలో 19 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులకు ఆరోగ్య పరీక్షలు చేశారు.
తొలి దశలో 65 మందికి..
బీఎంఐ పరీక్షల్లో 30 కన్నా ఎక్కువ మార్కులు ఉన్న స్థూలకాయం, ఎక్కువ తూకం ఉన్న 25 మంది ఏఎస్ఐలు, 74 మంది హెడ్ కానిస్టేబుళ్లను గుర్తించారు. తొలి దశలో 65 మంది సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. యోగా, పరుగు, నడక, ఇతర వ్యాయామాల ద్వారా తూకం తగ్గించుకోవడానికి శారీరక కసరత్తులు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు శిబిరం ప్రారంభం అవుతుంది. 50 ఏళ్లకు మించిన వారు 5 కిలోమీటర్ల దూరం నడవాలి. అంత కన్న తక్కువ వయస్సు గల వారు 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 8 గంటలకు ఫలాహారం, మధ్యాహ్నం 1 గంటకు ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులు క్లాసులు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి పరుగు, నడక ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు యోగా నేర్పిస్తారు. ఓ నెల పాటు జరిగే శిబిరం ఇది. బియ్యంతో చేసిన అన్నం మినహాయించి కొర్రబియ్యం, ఎర్రబియ్యం, జొన్నలతో చేసిన భోజనం వడ్డిస్తారు. జొన్నలు, రాగుల రొట్టె, అలాగే మజ్జిగ, సాంబార్ ఇస్తారు.
పోలీస్ శాఖలో దృఢకాయం తప్పనిసరి
ఈ విషయమై పోలీస్ కమిషన్ శశికుమార్ మాట్లాడుతూ శిబిరంలో 65 మంది సిబ్బంది పాల్గొనగా వీరిలో కొందరు 4 నుంచి 11 కేజీల వరకు తూకాన్ని తగ్గించుకున్నారన్నారు. సిబ్బంది సానుకూల దృక్పథంతో స్పందిస్తున్నారు. తమ శాఖలో చేరాలంటే దృఢకాయం తప్పనిసరి. అయితే వివిధ కారణాల వల్ల శారీరక తూకం పెరుగుతోంది. అలాంటి స్థూలకాయ దేహం కలిగిన వారికి గుర్తించి శిబిరానికి పంపిస్తున్నాం. పోలీస్ శాఖలో ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. బహిరంగ స్థలాల్లో, నిందితులను పట్టుకోవడంలో ఫిట్నెస్ ఉపయోగపడుతుంది. తొలిదశలో 90 కేజీలపై ఉన్న పురుషులు, 70 కేజీల పైన ఉన్న మహిళా సిబ్బందిని గుర్తించి ప్రభుత్వ ఆదేశం మేరకు శిబిరానికి పంపించాం. ప్రతి రోజూ యోగా, ఏరోబిక్, క్రికెట్, నడక, లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, జిమ్లో కసరత్తులు చేయిస్తున్నాం. పథ్యం తప్పనిసరిగా పాటించాలి. మరో బ్యాచ్కు సరిపడేంత సిబ్బంది ఉన్నారు. వారికి కూడా శిబిరానికి పంపుతాం. దీంతో వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
స్థూలకాయ దేహదండన ప్రారంభం
ఇకపై పోలీసులు చెమటోడ్చక తప్పదు