
క–క అభివృద్ధిపై శ్వేతపత్రం ప్రకటించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి సర్కారు ఎంత మేర నిధులు కేటాయించింది? ఎంత మేర నిధులు ఖర్చు చేశారో శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర యువ జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్త్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు జిల్లా దేవదుర్గలో ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన రూ.5 వేల కోట్ల నిధుల్లో రూ.3 వేల కోట్లు నిధులు విడుదల చేశామని అధికార పార్టీ పెద్దలు గొప్పలు చెప్పడం మాని శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి బడ్జెట్లో పెట్టిన విషయాలపై ఏ రహదారులు, పాఠశాలలు, బస్టాండ్లు, ఇతర సంక్షేమ పథకాలు చే పట్టారో జాబితాను విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కొలువు దీరిన శాసన సభ్యులు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారన్నారు. దీంతో ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, వైఫల్యాల గురించి విదితమవుతుందన్నారు. మధ్యవర్తుల ఆధారంగా కమీషన్ల దందాలతో ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మంత్రి రాజణ్ణ పేర్కొన్నట్లు ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవం జరుగుతుందడంలో ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు పండించిన వరి, జొన్న పంటలకు రక్షణ కల్పించలేదన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తరుణంలో మంత్రి కుమారస్వామి మామిడి, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, హన్మంతప్ప ఆల్కోడ్, శాసన సభ్యుడు నేమిరాజ్ నాయక్, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, చంద్రశేఖర్, రశ్మి రామేగౌడ, బసవరాజ్, విరుపాక్షి, శివశంకర్, తిమ్మారెడ్డిలున్నారు.
సర్కారుకు నిఖిల్ కుమారస్వామి సవాల్