జూలై 10 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు | - | Sakshi
Sakshi News home page

జూలై 10 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు

Jun 28 2025 6:05 AM | Updated on Jun 28 2025 6:05 AM

జూలై 10 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు

జూలై 10 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు

సాక్షి,బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ముందస్తు వర్షాలు కురవడంతో డ్యాంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ముందుగానే కాలువలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయం నుంచి సాగు నీటి విడుదలకు సంబంధించి శుక్రవారం బెంగళూరులోని విధానసౌధలో సమితి అధ్యక్షుడు, మంత్రి శివరాజ్‌ తంగడిగి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగభద్ర నీటి పారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కాలువలకు నీటి విడుదలపై చర్చించిన తర్వాత తేదీని ఖరారు చేశారు. ముందుగా ఈ ఏడాది డ్యాంలోకి ఎంత నీరు చేరుతుందన్న అంచనాపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది డ్యాంలోకి 157 టీఎంసీల నీరు చేరతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దామాషా ప్రకారం మూడు రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎంతెంత నీరు అందించాలో తీర్మానం చేశారు.

గేట్ల మరమ్మతు కోసం రబీలో క్రాప్‌హాలిడే?

ముఖ్యంగా ముందుగా డ్యాంలోకి నీరు చేరినందున జూలై 10వ తేదీ నుంచి హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీకు నీరు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. జూలై 2 నుంచి తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదలాలని నిర్ణయించారు. కర్ణాటక నీటి కోటాను విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నీటి కోటాను విడుదల చేసేందుకు కూడా అదే తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తుంగభద్ర క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంపై చర్చించిన తరుణంలో ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రమే డ్యాం ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. రబీ సీజన్‌లో పంటలు వేసుకునేందుకు అవకాశం దాదాపుగా లేకపోవచ్చని తెలుస్తోంది. సమావేశంలో విజయనగర, బళ్లారి, రాయచూరు జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌, శరణ ప్రకాష్‌ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాదర్లి హంపనగౌడ, నాగేంద్ర, గవియప్ప, రాఘవేంద్ర, గణేష్‌, తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌, సీఈ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌ పంటకు మాత్రమే సాగునీటి విడుదలకు చర్యలు

ఈఏడాది డ్యాంకు 157 టీఎంసీలు వస్తాయని అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement