క్రీడలతో స్నేహం, ఆరోగ్యం వృద్ధి | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహం, ఆరోగ్యం వృద్ధి

Jun 28 2025 6:05 AM | Updated on Jun 28 2025 6:05 AM

క్రీడలతో స్నేహం, ఆరోగ్యం వృద్ధి

క్రీడలతో స్నేహం, ఆరోగ్యం వృద్ధి

సాక్షి, బళ్లారి: జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు కలిసి క్రికెట్‌ ఆడదామని, క్రీడలు స్నేహాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటక వర్కింగ్‌ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో వీరశైవ కళాశాల మైదానంలో బళ్లారి మీడియా క్లబ్‌ క్రికెట్‌ టోర్నీ–2025 ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాత్రికేయులందరూ కలిసికట్టుగా వివిధ జట్లుగా ఏర్పడి క్రికెట్‌ ఆడటం హర్షణీయమన్నారు. సమాజాభివృద్ధిలో కీలకంగా పని చేసే విలేకరులతో క్రికెట్‌ ఆడే దిశగా జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన తర్వాత పోటీలను ఏర్పాటు చేద్దామన్నారు. క్రీడలతో స్నేహం పెంపొందడంతో పాటు ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీల్లో గెలుపొందిన జట్టుకు తాను వ్యక్తిగతంగా రూ.1 లక్ష, రన్నరప్‌ జట్టుకు రూ.50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. పాత్రికేయుల క్షేమాభివృద్ధి సంఘానికి కూడా తాను చేతనైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నగర మేయర్‌ ముల్లంగి నందీష్‌ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే పాత్రికేయులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. పాత్రికేయుల క్షేమాభివృద్ధి నిధికి రూ.51 వేల సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్‌ పాత్రికేయుడు వీరభద్రగౌడ పాత్రికేయుల క్షేమాభివృద్ధి సంఘం నిధికి రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు

బళ్లారిటౌన్‌: నగరంలో వీరశైవ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న విలేకరులకు క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. కర్ణాటక వర్కింగ్‌ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పాత్రికేయుల క్రికెట్‌ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు క్రికెట్‌ జట్లు పాల్గొనగా, వీటిలో బళ్లారి నగరం నుంచి రెండు జట్లు, సిరుగుప్ప తాలూకా నుంచి ఒక జట్టు, కంప్లి, కురుగోడుల నుంచి ఒక జట్టు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ఫైనల్స్‌కు బళ్లారి లయన్స్‌ జట్టు, కేకేఆర్‌ బుల్స్‌ జట్టు చేరుకోగా, కేకేఆర్‌ బుల్స్‌ జట్టు విజేతగా నిలిచింది. బళ్లారి లయన్స్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తొలుత ఈ క్రికెట్‌ పోటీలను మేయర్‌ ముల్లంగి నందీష్‌ ప్రారంభించారు. ఆ తర్వాత సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వచ్చి కాసేపు క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు. కాగా విజేత జట్టుకు జూలైలో నిర్వహించే పాత్రికేయుల దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తారు. మాజీ మేయర్‌ మోదుపల్లి రాజేశ్వరి, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరభద్రగౌడ, వార్త సహాయక అధికారి గురురాజ్‌, అడహక్‌ కమిటీ సభ్యులు మల్లయ్య, వెంకోబి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement