ఇంటిలో చోరీ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటిలో చోరీ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Jun 28 2025 6:05 AM | Updated on Jun 28 2025 6:07 AM

రాయచూరు రూరల్‌: ఇంటిలోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ శాంతవీర తెలిపారు. గురువారం సాయంత్రం రాయచూరు తాలూకా యరగేర పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఏప్రిల్‌ నెలలో ఇడపనూరు, యరగేర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఇళ్ల చోరీల్లో చిక్కమగళూరు జిల్లా కడూరు నంజుండప్ప(46), ఎమ్మిగనూరు తాలూకా ఇబ్రహీంపుర మాల నరేష్‌(40)లను పట్టుకుని విచారణ జరిపి వారి వద్ద నుంచి రూ.4.55 లక్షల విలువ చేసే బంగారు నగలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

యల్లమ్మ దేవికి

రూ.1.04 కోట్ల కానుకలు

హుబ్లీ: రాష్ట్రంలో సుప్రసిద్ధమైన సవదత్తి యల్లమ్మ దేవస్థానం హుండీ కానుకలు లెక్కింపు పూర్తి చేశారు. శుక్రవారం లెక్కింపులో రూ.1.04 కోట్ల కానుకలు హుండీల్లో లభించాయి. ఇందులో రూ.5.22 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.27 లక్షల విలువ చేసే 1276 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.98.23 లక్షల నగదు కానుకలు లభించాయని ఆలయ ప్రాధికార కార్యదర్శి ఆశోక్‌ దుడగుంటి తెలిపారు. ఏడు గుట్టలపై వెలసిన యల్లమ్మ సన్నిధికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతూ వివిధ రకాల కానుకలు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ కానుకలు వచ్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కెంపేగౌడ ఆదర్శాలు అనుసరణీయం

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో కెంపేగౌడ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెంపేగౌడ జయంతిని విద్యార్థినులతో కలిసి ప్రారంభించి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. కుల, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కెంపేగౌడ పెద్దపీట వేశారన్నారు. సాహితీవేత్త వీరహనుమాన్‌, బీఈఓ ఈరణ్ణ, తహసీల్దార్‌ సురేష్‌, కన్నడ సంస్కృతి శాఖ అధికారి వీరేష్‌నాయక్‌లున్నారు.

అమలు కాని సాగునీటి పథకాలు

దేవదుర్గలో కాంగ్రెస్‌ సర్కారుపై దేవెగౌడ విసుర్లు

రాయచూరు రూరల్‌: మహిళళా శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న దేవదుర్గ నియోజకవర్గంలో సాగునీటి పథకాల అమలుకు సర్కారు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ విమర్శించారు. ఆయన శుక్రవారం దేవదుర్గలో ప్రజలతో జనతాదళ్‌ జాతా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేవదుర్గ నియోజకవర్గంలో 10కి పైగా పెండింగ్‌లో ఉన్న సాగు నీటి పథకాలను అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమది కార్యకర్తల పార్టీ అన్నారు. బీజేపీతో 20 నెలలు, కాంగ్రెస్‌ పార్టీతో 13 నెలలు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన కుమార స్వామి రూ.28 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జేడీఎస్‌ పార్టీకి పూర్వ వైభవం లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు దేవదుర్గ తాలూకా చిక్కహొన్నకుణి వద్ద మాజీ ప్రధానమంత్రి దేవెగౌడపై అభిమానంతో గ్రామస్తులు తయారు చేసిన దేవెగౌడ ప్రతిమను ఆవిష్కరించారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌, కందకూరు శరణే గౌడ, నేమిరాజ్‌ నాయక్‌, చంద్ర శేఖర్‌, రాజు గౌడ, మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్‌, హన్మంతప్ప, వెంకట్రావ్‌ నాడగౌడ, రైతు మల్లనగౌడ నాగరాళ తదితరులు పాల్గొన్నారు.

ఇంటిలో చోరీ కేసు..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌1
1/2

ఇంటిలో చోరీ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ఇంటిలో చోరీ కేసు..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌2
2/2

ఇంటిలో చోరీ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement